KCR | కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మళ్లీ చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు వచ్చాయని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత కార్మికుల ఉపాధి కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బతుకమ్మ చీరలు, రంజాన్ తోఫా, క్రిస్మస్ తోఫా పెట్టి వాళ్లను ఆదుకున్నామని గుర్తు చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండిపోయిన పంటలను పరిశీలించిన అనంతరం.. సిరిసిల్లలో కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.
‘ ఆనాడు ఉద్యమం సమయంలో జయశంకర్ సార్తో కలిసి గంగాధర, సిరిసిల్ల మీదుగా హైదరాబాద్ వెళ్తున్నప్పుడు చేనేత కార్మికుల గురించి సిరిసిల్లలో గోడలపైన రాసిన రాతలు కనిపించాయి. చేనేత కార్మికులారా ఆత్మహత్య చేసుకోకండి.. సమస్యలకు చావుల పరిష్కారం కాదు అని రాసి ఉంటే.. నేను, జయశంకర్ సారు, నేను, నాతో పాటు ఉన్న ఉద్యమకారులకు కన్నీళ్లు వచ్చాయి. అప్పటికి స్వాతంత్య్రం వచ్చి 65 ఏండ్లు అయ్యింది. 65 ఏండ్ల స్వాతంత్య్ర భారతంలో చావకండి అని గోడల మీద రాసే ప్రభుత్వాలను చూశామంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఏముంటుందని అని అనిపించింది. ఎట్లయినా చేసి ఈ చేనేత కార్మికులను ఆదుకోవాలని అనుకున్నాం.’ అని కేసీఆర్ తెలిపారు. ఒకటే రోజు 11 మంది కార్మికులు చనిపోతే.. తమ పార్టీ నుంచి 50 లక్షలు తెచ్చి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశామని చెప్పారు. తెలంగాణ వస్తది.. వచ్చాక మిమ్మల్ని బిడ్డల లెక్క సాదుకుంటా అని ఆనాడు నిర్వహించిన సభలో ఆర్ద్రతతో చెప్పిన అని అన్నారు. అన్నట్టుగానే తెలంగాణ రాగానే చేనేత కార్మికులను ఆదుకున్నామని చెప్పారు.
ఒకనాడు భూదాన్ పోచంపల్లిలో ఏడుగురు చేనేత కార్మికులు ఒక్కటేసారి చచ్చిపోయిండ్రు అని కేసీఆర్ గుర్తు చేశారు. అప్పుడు చంద్రబాబు అనే ఒక మూర్ఖుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడని.. చనిపోయిన చేనేత కార్మికుల కుటుంబాలకు 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కోరా.. కానీ ఆ దరిద్రుడు ఇవ్వలేదు అని తెలిపారు. దాని దరిమిలా నిజామాబాద్ పట్టణం, హైదరాబాద్ ఆబిడ్స్లో బిక్షాటన చేస్తే వచ్చిన 7.5 లక్షలను బాధిత కుటుంబాలకు ఇచ్చామని చెప్పారు. అలా భువనగిరి, గద్వాల, దుబ్బాక, సిరిసిల్లలో రోజూ చనిపోయే చేనేత కార్మికులను ఆదుకోవాలనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వచ్చామని అన్నారు. అటు పేద ప్రజలకు ఎంతో కొంత మేలు జరగడంతో పాటు ఇటు కార్మికులు ఉపాధి వస్తుందని పలు పథకాలు తీసుకొచ్చామని చెప్పారు. రంజాన్ తోఫా, క్రిస్మస్ తోఫా, బతుకమ్మ చీరలు అని పెట్టి చేనేత కార్మికులకు ఆర్డర్లు ఇచ్చినమని.. స్కూల్ యూనిఫాంలు నేయమని ఆర్డర్లు ఇచ్చినమని తెలిపారు. కానీ ఇవాళ దురదృష్టం ఏంటంటే.. ఇవాళ మళ్లీ మేం ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు వచ్చాయని చేనేత కార్మికులు తనతో చెప్పుకుని బాధపడుతున్నారని తెలిపారు. ‘మీ గవర్నమెంట్లో ఇచ్చిన ఆర్డర్ బాపతి 300 కోట్లు బకాయిలు ఉన్నాయి.. అవి ఇస్తలేరని చేనేత కార్మికులు చెప్పిండ్రు’ అని కేసీఆర్ తెలిపారు. అప్పుడు వాళ్లను రండి.. దీనిపై హైకోర్టులో కేసు వేద్దాం.. వాళ్లను బజార్లకు గుంజుదామని చెప్పానన్నారు. వీళ్ల రెఫరెండం సంగతి ఏంటో కూడా చూద్దామని చెప్పానని అన్నారు. దీనిపై రేపు 10 వేల మందితో చేనేత కార్మికులు సిరిసిల్లలో ధర్నా పెట్టారని తెలిపారు. ఈ ధర్నాకు తమ పార్టీ నాయకులు హాజరవుతారని.. వాళ్లకు అండగా ఉంటారని పేర్కొన్నారు.