హైదరాబాద్ : రాష్ట్రంలో శాంతిభద్రతులు క్షిణించాయని బీఆర్ఎస్ నేతలు అన్నారు. నిన్న కరీంనగర్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్పై బీజేపీ గూండాలు దాడికి పాల్పడి విధ్వంసం సృష్టించారు. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పాడ్డారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం శుక్రవారం డీజీపీ సీవీ ఆనంద్కు ఫిర్యాదు చేశారు. కాగా, కరీంనగర్లో బీజేపీ రౌడీమూకలు, ప్రజాప్రతినిధులు రెచ్చిపోయారు. ఏకంగా బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై దాడి చేసేందుకు కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లోకి రాళ్లు, కర్రలతో దూసుకొచ్చి వీరంగం సృష్టించారు.
అక్కడినుంచి కౌశిక్రెడ్డిని పోలీసులు హుజూరాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కు తీసుకెళ్లగా అక్కడ కూడా దాడికి తెగబడ్డారు. దాడిపై ప్రశ్నించినందుకు కరీంనగర్ విద్యారణ్యపురిలోని బీఆర్ఎస్ నాయకురాలు, సోషల్ మీడియా కార్యకర్త గోడిశాల పావనీగౌడ్ ఇంటిపై బీజేపీ, బీజేవైఎం కార్యకర్తలు దాడికి యత్నించారు. అంతటితో ఆగకుండా జ్యోతినగర్లోని బండి సంజయ్ క్యాంప్ ఆఫీస్ ఎదుట నిరసన తెలిపేందుకు వెళ్లిన బీఆర్ఎస్ నాయకులపైనా బీజేపీ నేతలు విచక్షణారహితంగా కర్రలతో దాడికి తెగబడ్డారు. ఇలా నాలుగు చోట్ల బీజేపీ గూండాలు అరాచకం సృష్టించిన విషయం తెలిసిందే.