న్యూస్ నెట్వర్క్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపమైన ప్రగతిభవన్ను మావోయిస్టులు పేల్చివేయాలని టీపీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ భగ్గుమన్నది. అతడి ఒంటెత్తు పోకడనచ్చక కాంగ్రెస్ నుంచి సీనియర్ నేతలంతా బయటకు వెళ్లిపోతుండటంతో ఫ్రస్టేషన్లో రేవంత్ అడ్డగోలుగా మాట్లాడుతుండటంపై మండిపడింది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా రేవంత్రెడ్డి శవయాత్రలు జరిపి అనంతరం దిష్టిబొమ్మలను దహనం చేశారు. తన పాదయాత్రలో భాగంగా మహబూబాబాద్లోని ముత్యాలమ్మ గుడి సమీపంలో వాహనంపై రేవంత్ మాట్లాడుతుండగా.. అటుగా వెళ్తున్న బీఆర్ఎస్ అభిమాని రేవంత్పైకి చెప్పు విసిరాడు. అది జనం మధ్యలో పడింది.
అక్కడే ఉన్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని ఠాణాకు తరలించారు. రేవంత్ వివాదాస్పద వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. ములుగు, నర్సంపేట, నల్లబెల్లి, దుగ్గొండి, చెన్నారావుపేట, ఖానాపురం, నెక్కొండ మండల కేంద్రాల్లో రేవంత్రెడ్డి దిష్టిబొమ్మలతో శవయాత్రలు నిర్వహించి దహనం చేశాయి. రేవంత్రెడ్డితోపాటు ములుగు ఎమ్మెల్యే సీతక్కపై ములుగు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పీసీసీ తెలంగాణ అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు రేవంత్రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు డీజీపీ అంజనీకుమార్కు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, టీ రవీందర్రావు, ఎల్ రమణ, తాతా మధు, శంబీపూర్రాజు, దండె విఠల్ బుధవారం డీజీపీకి లేఖ అందించారు. రేవంత్రెడ్డి తన పాదయాత్రలో ప్రగతిభవన్ను పేల్చి వేయాలని కోరడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు పేరొన్నారు. చట్టసభల్లో సభ్యుడిగా ఉండి అధికార భవనాలను కూల్చివేయాల్సిందిగా కోరడమంటే, ఇది చట్ట వ్యతిరేక చర్యగా భావించాలని ఎమ్మెల్సీలు కోరారు.
సీఎం నివాసం ప్రగతిభవన్ను పేల్చివేయాలన్న రేవంత్రెడ్డిపై పీడీయాక్టు నమోదు చేయాలి. వెర్రికూతలు కూస్తున్న అతడి తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. అతడి అహంకారపూరిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు స్పందించాలి. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీనియర్ నేత జానారెడ్డి, ఇతర నేతలు ఆ వ్యాఖ్యలను సమర్థిస్తున్నారా? ఒకవేళ సమర్థిస్తే.. మీ పార్టీ స్టాండ్ కూడా అదేనా? లేదా అతడి మాటలను ఖండిస్తే.. ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది స్పష్టంచేయాలి. గతంలో ఏ రాజకీయ నాయకుడూ ఇలా మాట్లాడలేదు. రేవంత్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ నైతిక బాధ్యత వహించాలి.
– ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి
రేవంత్రెడ్డి ఫ్రస్టేషన్లో ఉన్నారు. ఆయన పార్టీలోనే ఆయన నాయకత్వాన్ని బలరిచేవారు లేరు. కాబట్టే.. తన ఉనికిని కాపాడుకునేందుకు యాత్రలు చేస్తున్నాడు. పేల్చేయడం, కూల్చేయడం అనే మాటలు సంఘ విద్రోహశక్తులు మాట్లాడతారు. తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడు. అసలు కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏందో రాహుల్గాంధీ, ఖర్గే చెప్పాలి. విధ్వంసమే మీ విధానమా? అహింసా పునాదులపై కట్టబడిన కాంగ్రెస్లో రేవంత్ లాంటి వ్యక్తులు దూరి.. ఆ పార్టీకి నూకలు లేకుండా చేస్తున్నారు.
– ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
బండిది కూల్చుడు.. రేవంత్రెడ్డిది పేల్చుడు. ఇద్దరూ సంఘవిద్రోహ శక్తులే. వీరిద్దరి వల్లే తెలంగాణ ప్రశాంతతను కోల్పోతున్నది. ఇన్నేండ్లసంది కేసీఆర్ నాయకత్వంలో ప్రశాంతంగా, సుభిక్షంగా ఉన్న తెలంగాణను చూసి వారు కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారు. కేసీఆర్ నాయకత్వం ముందు రేవంత్, బండి నాయకత్వం ఎంత? ప్రజలకు ఏం చేస్తున్నారు మీరు? పచ్చని తెలంగాణలో విద్వేషాలు, విధ్వంసాల గురించి మాట్లాడుతున్న రేవంత్ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలి.
– ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
ముఖ్యమంత్రి నివాసమైన ప్రగతిభవన్ను నక్సలైట్లు పేల్చేయాలని చేసిన వ్యాఖ్యలను పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ఉపసంహరించుకోవాలి. లేదంటే ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది. బాధ్యతాయుతమైన హోదాలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. కాంగ్రెస్ పార్టీకి కూల్చుడు.. కాల్చుడు రాజకీయం తప్ప ఇంకేమీ తెలియదు. ప్రభుత్వాన్ని నడపడానికి కాంగ్రెస్కు అర్హత లేదు. అందుకే ప్రజలు ఆ పార్టీకి అధికారం ఇవ్వకుండా పక్కనపెట్టారు.
– రెడ్కో చైర్మన్ వై సతీశ్రెడ్డి
రేవంత్ రెడ్డి ‘హాథ్ సే హాథ్ జోడో’ యాత్రలో ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రగతిభవన్ను కూల్చడమంటే ప్రజాస్వామ్యాన్ని కూల్చటమే. ఇటువంటి వ్యాఖ్యలు చేసిన రేవంత్పై పీడీ యాక్ట్ నమోదు చేయాలి. సీఎం కేసీఆర్ కేసీఆర్ పాలనను జీర్ణించుకోలేకే రేవంత్ పనికిరాని మాటలు మాట్లాడుతున్నారు.
– బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు