Singireddy Niranjan Reddy | రుణమాఫీ అమలుపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దిల్సుఖ్నగర్లో విమానాలు అమ్మడం ఎంత నిజమో.. తెలంగాణలో భాక్రానంగల్ డ్యామ్ ఎంత నిజమో.. తెలంగాణలో రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీ అంతే నిజమని విమర్శించారు. అభినవ గోబెల్స్ అవార్డు ఇస్తే అది రేవంత్ సర్కారుకు దక్కుతుందని ఎద్దేవా చేశారు.
ఎన్నికల సమయంలో రైతులందరికీ రుణమాఫీ చేస్తామని పదే పదే చెప్పారని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. బడాయిల బచ్చిగానికి ఏడు దొడ్లు.. మూడు ఎడ్లు అన్నట్లు.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, చేస్తున్న పనులకు తెలంగాణ ప్రజలు చెప్పుకునే ఈ మాటలు సరిగ్గా సరిపోతాయని తెలిపారు. డిసెంబరు 9న రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి ప్రచారంలో చెప్పారని గుర్తుచేశారు. జనవరి 6న ఓ మీడియా ఛానల్తో ఒకటి, రెండు నెలలలో రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డే ప్రకటించారని అన్నారు. మూడు విడతల్లో రూ.31 వేల కోట్లు ఆగస్ట్ లోపలే పూర్తి చేస్తానని జులై 18న హామీ ఇచ్చారని అన్నారు. జూలై 28న అమెరికా వెళ్తూ రాగానే రుణమాఫీ చేస్తానని రేవంతే ప్రకటించారని అన్నారు. కానీ ఆగస్ట్ 15న రూ.17,869 వేల కోట్లు రుణమాఫీ చేశామని చెప్పుకున్నాడని తెలిపారు.
ఆగస్ట్ 15 నాటికి అందరి రైతుల రుణాలు మాఫీ అవుతాయని రేవంత్ ప్రకటించాడని సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. మరి రూ.31 వేల కోట్లకు కేవలం 17 వేల కోట్లతో రుణమాఫీ ఎలా పూర్తవుతుందని ప్రశ్నించారు. ఆరు గ్యారంటీలలో ఉచిత బస్సు మినహా ఏ ఒక్క హామీ పూర్తిగా అమలు చేయలేదని మండిపడ్డారు.
ఆరు గ్యారంటీలు గడువులోగా అమలు చేస్తే పదవికి రాజీనామా చేస్తానని హరీశ్ రావు అన్నారని అన్నారు. ఆ విషయాన్ని రుణమాఫీ చుట్టూ తిప్పి అరకొరగా అమలుచేసి రుణమాఫీ అయిపోయిందని దబాయిస్తూ రాజీనామా చేయాలని దుర్భాషలాడడం సరికాదని హితవుపలికారు. రాష్ట్రంలో ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై అత్యధిక ప్రజాదరణ కలిగిన నేత హరీశ్ రావు అని తెలిపారు. ఏ బ్యాంకులో రైతుల రుణాలు మాఫీ అయ్యాయో సర్కారు చెబుతుందా ? రుణమాఫీ అయిపోతే రాష్ట్రంలో రైతులు ఎందుకు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని నిలదీశారు.
రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులు ఉండగా 60 లక్షల మంది రుణాలు తీసుకున్నారని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం 44 లక్షల మంది అని లెక్కలు చెబుతున్నదని.. మరి ప్రభుత్వం ఎందుకు 22 లక్షల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ ఎందుకు చేసిందని ప్రశ్నించారు. అసలుకంటే కొసరు ఎక్కువ అన్నట్లు రుణమాఫీపై మీడియా ప్రకటనలకే రూ.300 కోట్లు వరకు ఖర్చు చేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో రూ.29 వేల కోట్లు రుణమాఫీ, రూ.72 వేల కోట్లు రైతుబంధు పథకం కింద రైతులకు అందజేసి అండగా నిలిచామని తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం రైతుభరోసా విడత కింద ఒక్కసారికి రూ.15 వేల కోట్లు అవసరం అవుతుందని.. రైతుభరోసా ఎగ్గొట్టి రూ.17 వేల కోట్లు రుణమాఫీ చేసి రైతులను మోసం చేసిందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను, ఉపాధి హామీ కూలీలను వెన్నుపోటు పొడిచిందని.. ఆసరా ఫించను దారులను వెన్నుపోటు పొడిచిందని.. నిరుద్యోగులను వాడుకుని ఓట్లేయించుకుని నిరుద్యోగ భృతి ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచిందని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. గ్రామ పంచాయతీలతో పారిశుద్ధ కార్మికులకు, పాఠశాలలో వంట కార్మికులకు వేతనాలు రాక గ్రామాలలో తండ్లాడుతున్నారని అన్నారు. మహాలక్ష్మి పథకం కింద రూ.2500 అని చెప్పి ఆ పథకం గురించి మాట్లాడటం లేదని మండిపడ్డారు.
మాట మీద నిలబడిన హరీశ్ రావును రాజీనామా చేయమనడం హస్యాస్పదమని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. పార్లమెంటులో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ మధ్యకాలంలో చాలా విషయాలలో చక్కగా వ్యవహరిస్తున్నాడని.. మరి అదే పార్టీకి చెందిన ముఖ్యమంత్రి తెలంగాణలో ఎదుటి వ్యక్తులను అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని… తూలనాడుతున్నాడని మండిపడ్డారు. రాహుల్ గాంధీ మాట్లాడే హిందీ, ఇంగ్లీష్ భాషలు చాలా చక్కగా ఉంటాయి .. అవి రేవంత్ రెడ్డికి అర్థంకానట్లుందని.. అందుకే అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని అన్నారు.
కేంద్రంలో ప్రతిపక్షం ప్రశ్నిస్తే అధికార పక్షం నెహ్రూ, ఇందిరల గురించి మాట్లాడుతారని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రశ్నిస్తే గత పదేళ్లలో వందేళ్ల విధ్వంసం అని అడ్డగోలు వాదనకు దిగుతారని మండిపడ్డారు. ప్రపంచబ్యాంకుతో మాట్లాడిన ముఖ్యమంత్రికి తెలంగాణలో ఉన్న బ్యాంకు అధికారులతో మాట్లాడి ఏ రైతుకు రుణమాఫీ జరిగిందో చెప్పడానికి సమయం లేదా ? అని ప్రశ్నించారు. రైతుభరోసాపై క్యాబినెట్ సబ్ కమిటీ, చర్చలు, శాసనసభలో చర్చలన్నీ పక్కకు పోయాయని అన్నారు. జూలై 15వ తేదీకి నివేదిక అన్నారని .. ఆగస్ట్ 15 వచ్చినా గతి లేదని పేర్కొన్నారు.
కనీసం కృష్ణానదిలో పోతున్న నీటిని ఒడిసిపట్టుకునే ఆలోచన ప్రభుత్వానికి లేదని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. పాలమూరు జిల్లాలో కుంటలు, చెరువులు వెలవెలబోతున్నాయని అన్నారు. కట్టిన రిజర్వాయర్లను నింపుకునే సోయి ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు. గత ఎనిమిది నెలలలో తట్టెడు మట్టి తీయకుండా పనులు పక్కన పెట్టారని అన్నారు. పాలమూరు రంగారెడ్డి పథకంలో మూడు రిజర్వాయర్లలో 28 టీఎంసీల వరకు నిల్వ చేసుకునే అవకాశం ఉన్నా గాలికి వదిలేశారని విమర్శించారు.
రైతాంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. గత ప్రభుత్వంలోనే సిద్ధం చేసిన పంపును కూడా వాడుకునే ఉద్దేశం లేదని అన్నారు. ప్రభుత్వాలు మారినా ప్రజలు మన వాళ్లు అన్న ఆలోచన ప్రభుత్వానికి లేదని.. కేసీఆర్ సిద్ధం చేసిన ప్రాజెక్టులను వాడుకోవడం పట్ల అశ్రద్ధ చేస్తున్నారని విమర్శించారు. రైతుల మంచితనం, అమాయకత్వం కాంగ్రెస్ పార్టీకి ఒక మూల పెట్టుబడిగా మారిందని.. ఆశపడ్డ రైతులను అమాంతం వంచించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో రైతుల పరిస్థితి ధీనంగా ఉందని.. ప్రజల పట్ల ప్రభుత్వం నిర్దయగా వ్యవహరిస్తుందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. పాలమూరు నుంచి ముఖ్యమంత్రి అయినందుకు రోశం ఉంటే, సిపాయి అయితే కేసీఆర్ కన్నా వేగంగా పనులు చేసి చూయిస్తానని సవాలు విసిరి పనులు చేసి చూపించాలని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఒక స్థాయికి వచ్చిన తెలంగాణ వ్యవసాయం కాంగ్రెస్ పాలనలో ఆగమైందని ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీ అయిన 22 లక్షల మంది రైతులను కదిలించినా రైతుబంధు ఎగ్గొట్టి రుణమాఫీ చేశాడని విమర్శించారు.
ఇతరులను చిన్నబుచ్చి మాట్లాడినంత మాత్రాన గొప్పోళ్లు కాలేరని.. వాళ్లకన్నా గొప్ప పనులు చేస్తే గొప్పవాళ్లు అవుతారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి హితవుపలికారు. ఈ శతాబ్దానికి సరిపడినంత మోసం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రైతాంగానికి చేసిందని మండిపడ్డారు. రుణమాఫీపై బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన కాల్ సెంటర్కు ఇప్పటి వరకు 1,11,027 వాట్సాప్ ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. బీఆర్ఎస్ కాల్ సెంటర్కు వచ్చిన ఫిర్యాదులను సీఎం కార్యాలయానికి పంపిస్తామని చెప్పారు.