Ravula Sridhar Reddy | రాష్ట్రంలో బీఆర్ఎస్ పనైపోయిందంటూ బీజేపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై రావుల శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు రిలవెన్స్ లేదని.. ఒక్కసీటు కూడా గెలవదని వారం రోజులుగా బీజేపీ నాయకులు పదే పదే అంటున్నారని ఆయన సీరియస్ అయ్యారు. మేం బలహీనం అయ్యామని అనుకుంటే.. రోజు మాపై ఆరోపణలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో రావుల మాట్లాడుతూ.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పార్లమెంటరీ నియోజకవర్గంలోని ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్లోని బీజేపీ గెలవలేదని.. నగరంలో రాజాసింగ్ మినహా ఒక్క సీటు కూడా గెలవలేకపోయారని అన్నారు. అయినప్పటికీ బీఆర్ఎస్ రిలవెంట్ కాదని కిషన్రెడ్డి అనడం విచిత్రంగా ఉందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ బలహీనమైతే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా ఓడిపోయావని బండి సంజయ్ను ప్రశ్నించారు.
బీజేపీ నాయకులు అసలు విజయ సంకల్ప యాత్ర ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి బ్రహ్మాండంగా సాయం చేసి ఉంటే.. సాధారణ ప్రచారంతోనే ఓట్లు రావాలని కదా అని ప్రశ్నించారు. ఖాళీగా ఉంటే రోజూ తన్నుకు చస్తున్నారనే.. ఇలా ఏదో ఒక పనిలో పెడితే కొద్దిగా నయ్యమని యాత్రలు చేయమని అధిష్ఠానం సూచించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. అసలు మీ యాత్రలో మమ్మల్ని తిట్టడం తప్ప రాష్ట్రానికి ఏం తెస్తారు? ఏం చేశారో ఒక్క రోజైనా చెబుతున్నారా? అని రావుల ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో నగరంలో సింగిల్ సీటు సాధించని మీరు మమ్మల్ని విమర్శించడమేంటని మండిపడ్డారు. రెండు జాతీయ పార్టీలతో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని అన్నారు. రాష్ట్రానికి న్యాయం జరగాలని పోరాడేది బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు మాత్రమే అని స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగితే మోదీని ప్రశ్నించగలుగుతారా అని బీజేపీ నేతలను రావుల ప్రశ్నించారు. ఐటీఐఆర్, కోచ్ ఫ్యాక్టరీ, నిమ్స్, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, విభజన హామీలు ఏవీ సాధించలేదని.. మీవల్ల రాష్ట్రానికి ఏం ప్రయోజనం జరిగిందో చెప్పి ఓట్లు అడగాలని బీజేపీ నాయకులను డిమాండ్ చేశారు. పేరులో విజయ సంకల్పం ఉంటే సరిపోదని.. దాంట్లో ప్రజా ప్రయోజనం ఉండాలని విమర్శించారు. ఈ సారి ఎన్నికల్లో గెలిస్తే ఏం చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రాంతీయ పార్టీల రిలవెన్స్ లేదని చెప్పే బీజేపీ నాయకులు ప్రాంతీయ పార్టీలతో పొత్తులెందుకు పెట్టుకుంటున్నారని ప్రశ్నించారు. అసలు ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్కు మధ్యనే పోటీ అని.. బీజేపీకి గతంలో వచ్చిన నాలుగు సీట్లు మళ్లీ వస్తే గొప్ప అని అభిప్రాయపడ్డారు