Koppula Eshwar | ఎన్నికల సమయంలోనే ప్రజల ముందుకు వచ్చే పెట్టుబడిదారులకు ఓటేసి మోసపోవద్దని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ హెచ్చరించారు. సింగరేణి కార్మికుడి బిడ్డనైనా తనకు అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. 20 ఏండ్ల రాజకీయ జీవితం, మంత్రిగా చేసిన అనుభవంతో ప్రజా సమస్యలను పరిష్కరిస్తానని అన్నారు. శుక్రవారం పెద్దపల్లి జల్లా సుల్తానాబాద్లో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉదయం వాకర్స్తో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. కూరగాయల మార్కెట్కు వెళ్లి వ్యాపారులు, వినియోగదారులను ఓటు అభ్యర్థించారు.
ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో వచ్చి మాయమాటలు చెప్పే వలసదారులు, ఎన్నికలు ముగిసిన వెంటనే కన్నెత్తి చూడరని చెప్పారు.
ఈ ప్రాంతానికి తన సేవలు అవసరమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావించి.. తనకు పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా అవకాశం ఇచ్చారని తెలిపారు. ఈ నియోజకవర్గం పూర్తిగా సింగరేణి గనులతో కూడుకున్నదనీ.. తాను సింగరేణిలో 26 ఏళ్లుగా పనిచేసిన కార్మికుడిననీ ఈ ప్రాంతం వారితో తనకు సంబంధాలున్నాయని అన్నారు. పెద్దపల్లి ప్రజలు కారు గుర్తుకు ఓటేసి తనను ఆశీర్వదించాలని కోరారు. చూట్టపు చూపుగా వచ్చే వారికి అవకాశం ఇవ్వొద్దని సూచించారు.