సర్కారు మెడలు వంచినం ఇయ్యాల రైతుబంధు ఎందుకు పడింది? కేసీఆర్ పిడికిలి బిగించి, కాలు విరిగినా బస్సెక్కి గర్జన చేసిండు కాబట్టే రైతుబంధు పడింది. కేసీఆర్ దెబ్బకు ముఖ్యమంత్రి వెన్నులో వణుకు మొదలై ఇయ్యాల రైతుబంధు వేస్తున్నడు. ఈ ప్రభుత్వం మెడలు వంచి.. గ్యారెంటీలన్నీ అమలు చేయించాలంటే కచ్చితంగా బీఆర్ఎస్ గెలవాలె.
KCR | హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): తాను రోడ్డెక్కి పిడికిలి బిగిస్తే తప్ప రైతుబంధు స్టార్ట్ కాలేదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ దెబ్బకు దెయ్యం వదిలిందని, ముఖ్యమంత్రికి వణుకు మొదలై ఇయ్యాల రైతుబంధు వేస్తున్నారని, పోరాడకుంటే ఏదీ జరగదని పేర్కొన్నారు. ‘కేసీఆర్ బస్సు ఎక్కిండు. కాలువిరిగినా బస్సెక్కి గర్జన చేసిండు కాబట్టే రైతుబంధు పడుతున్నది’ అని వివరించారు. ఇప్పుడు ఇచ్చినా ముందటికి దెబ్బ పెడతరని హెచ్చరించారు. ఐదెకరాల కంటే ఎక్కువ ఉన్నోళ్లకు రైతుబంధు వెయ్యబోమని అంటున్నారని, ఆరేడు ఎకరాల వాళ్లు ఏం తప్పు చేశారని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం మెడలు వంచి ఇచ్చిన గ్యారెంటీలన్నీ అమలు చేయించాలంటే కచ్చితంగా బీఆర్ఎస్ గెలవాల్సిందేనని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్లో సోమవారం నిర్వహించిన రోడ్షోలో కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ నాలుగు నెలలుగా తియ్యటి మాటలు చెప్తున్నది తప్పితే ఇచ్చిందేమీ లేదని నిప్పులు చెరిగారు. దేవుళ్లపై ఒట్లు.. కేసీఆర్పై తిట్లు అన్న చందంగా సీఎం తీరు ఉన్నదని మండిపడ్డారు. బీఆర్ఎస్ అభ్యర్థులను ఆదరించి గెలిపించాలని, నిజామాబాద్ జిల్లాలో పులిబిడ్డ బాజిరెడ్డి గోవర్ధన్ గెలిపించాలని కోరారు.
అచ్చేదిన్ కాదు.. సచ్చేదిన్
నిజామాబాద్లో గత ఎన్నికల్లో బీజేపీ ఎంపీని గెలిపించారని, ఏమన్నా లాభం జరిగిందా అంటూ కేసీఆర్ సభకు హాజరైన ప్రజలను ప్రశ్నించారు. ఏక్ అణా పని కూడా కాలేదని పేర్కొన్నారు. ప్రధానమంత్రిగా మోదీ, ముఖ్యమంత్రిగా తాను ఒకేసారి ఎన్నికయ్యామని, ప్రధాని అయ్యేముందు, ఆ తర్వాత మోదీ 150 దాకా నినాదాలు చెప్పారని, వాటిలో ఒక్కటైనా నిజమైందా? అని ప్రశ్నించారు. ‘సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్’ లేదు కానీ ‘దేశ్ కా సత్యనాశ్’ అయిందని ఆవేదన వ్యక్తంచేశారు. ‘మేకిన్ ఇండియా’, ‘డిజిటల్ ఇండియా’, ‘భేటీ పడావో.. భేటీ బచావో’ ఎక్కడన్నా కనబడుతున్నవా? అని ప్రశ్నించారు. దేశంలో రోజూ మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని, నరేంద్రమోదీ రాజ్యంలో భేటీకి రక్షణ ఉందా? అని ఆవేదన వ్యక్తం చేశారు. ‘అచ్చే దిన్’ తెస్తానన్న మోదీ సచ్చేదిన్ తెచ్చారని మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్ ధరలు, జీఎస్టీలు పెరిగాయని పేర్కొన్నారు. మోదీ చేస్తానన్న రైతుల ఆదాయం రెట్టింపు అయిందా?వికసిత్ భారత్ అయిందా? జన్ధన్ వల్ల ఏమన్నా లాభం జరిగిందా? అని ప్రశ్నించారు.
నిజామాబాద్లో మోదీ రూ. 30 లక్షలు ఇచ్చిండట కదా!
తాను ప్రధానిని అయితే ప్రతి ఇంటికీ రూ.15 లక్షలు ఇస్తానని మోదీ చెప్పారని, నిజామాబాద్లో బీజేపీ ఎంపీ ఉన్నాడు కాబట్టి ఇక్కడి వాళ్లకు రూ. 30 లక్షలు వచ్చాయట కదా.. అని కేసీఆర్ ఎద్దేవా చేశారు. ‘15 లక్షలు లేదు.. పాసు లేదు.. అంతా ఉట్టిదే గ్యాస్’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు.‘నరేంద్రమోదీ నిటారుగా మనకున్న గోదావరిని ఎత్తుకపోయి తమిళనాడుకు ఇస్తానంటున్నాడు. అట్లనే చూద్దామా? కొట్లాడుదామా? యుద్ధం చేద్దామా?’ అని ప్రశ్నించారు. మన గోదావరి మనకు ఉండాలంటే, మన నది మీద మనకు నీళ్ల హక్కు ఉండాలంటే నిజామాబాద్లో నిజామాబాద్ పులిబిడ్డ బాజిరెడ్డి గోవర్ధన్ గెలవాలని, ఈ గ్యాస్గాళ్లు గెలిస్తే తాకులాటలు పెట్టుడు తప్ప ఏమీ రాదని పేర్కొన్నారు.
వీళ్లు నోరు తెరుస్తరా?
నిజామాబాద్ గడ్డపై తాను గులాబీజెండా ఎత్తిన నాడు తనవెంట నిలబడి, నిజామాబాద్ జిల్లా పరిషత్ను గెలిపించినది ఈ జిల్లాయేనని, కేసీఆర్ సచ్చిపోయే వరకు గుండెల్లో ఉంటుందని కేసీఆర్ వివరించారు. ఉద్యమాన్ని ఆకాశానికి ఎత్తిన జిల్లా అని తెలిపారు. ‘మోదీ.. గోదావరి నదిని తీసుకుపోతా అంటున్నడు. బీజేపీ ఎంపీలు గెలిస్తే మోదీ దగ్గర చేతులు కట్టుకొని నిలబడతరు తప్ప నోరు తెరుస్తరా? మన హక్కుల గురించి ఎన్నడైనా నోరు తెరిచారా?’ అని ప్రశ్నించారు. ప్రతి జిల్లాకు ఒక నవోదయ పాఠశాల ఇవ్వాలని మోదీకి 150 ఉత్తరాలు రాశానని, ఒక్కటి కూడా ఇవ్వలేదని గుర్తుచేశారు. ఒక్క నవోదయ పాఠశాల కూడా ఇవ్వని మోదీకి, బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలని నిలదీశారు. యువత ఈ విషయాన్ని ఆలోచించాలని కోరారు. దేశంలో మోదీ 157 మెడికల్ కాలేజీలు పెడితే తెలంగాణ ఒక్కటి కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వని మోదీకి ఓటెందుకు వెయ్యాలని ప్రశ్నించారు.
బంగారు జిల్లాను ఎండబెట్టారు
ఒకప్పుడు బంగారు జిల్లా అయిన నిజామాబాద్ను కాంగ్రెస్, టీడీపీ హయాంలో పూర్తిగా ఎండబెట్టారని కేసీఆర్ విమర్శించారు. నిజాంసాగర్ను మునగ్గొట్టారని.. గుత్ప, అలీసాగర్ అని చెప్పి అదికూడా సరిగా చేయలేదని తెలిపారు. తెలంగాణ వచ్చిన తరువాత నిజాంసాగర్ను మల్లన్నసాగర్కు లింక్ చేసుకున్నామని, కాళేశ్వరం నీళ్లు వచ్చేటట్టు చేసుకున్నామని వివరించారు. శ్రీరాంసాగర్ను పునరుజ్జీవం చేసుకున్నామని, వరద కాల్వను రిజర్వాయర్గా మార్చుకున్నామని పేర్కొన్నారు.
ఆ నీళ్లు ఇప్పుడు ఎక్కడికి పోయినయ్?
ఈ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ వాళ్లు కరెంటును బ్రహ్మాండంగా ఇస్తున్నామని మాట్లాడుతున్నారని, కరెంటు కోతలు ఉన్నాయా? గతంలో ఉండేవా? అని రోడ్షోకు హాజరైనవారిని ప్రశ్నించారు. పట్టణంలో పేదలకు ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్ ఇచ్చామని, గ్రామాల్లో అది కూడా తీసుకోకుండా ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చామని పేర్కొన్న కేసీఆర్.. ఇప్పుడా నీళ్లన్నీ ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు.
ప్రభుత్వ అసమర్థత వల్లే
కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు నెలలుగా అరచేతిలో వైకుంఠం చూపిస్తూ ఆరు గ్యారెంటీలని మోసం చేసిందని కేసీఆర్ మండిపడ్డారు. ఒక్క గ్యారెంటీ కూడా అమలు కాలేదని మండిపడ్డారు. కల్యాణలక్ష్మి కింద ఇస్తామన్న తులం బంగారం తుస్సు, వడ్లకు ఇస్తామన్న రూ. 500 బోనస్ బోగస్ అని పేర్కొన్నారు. ధాన్యానికి పాతధర కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. విద్యార్థులకు ఐదు నెలలుగా ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం లేదని, ఓవర్సీస్ స్కీంను ఆపేశారని, కేసీఆర్ కిట్ ఇవ్వడం లేదని, సీఎంఆర్ఎఫ్ను బంద్ పెట్టారని తెలిపారు. చేనేత కార్మికులకు ఆర్డర్లు ఇవ్వకపోవడంతో మళ్లీ ఆత్మహత్యలు మొదలయ్యాయని చెప్పారు. పరిశ్రమలు తరలిపోయే పరిస్థితి వచ్చిందని, ఐదు నెలల్లో ఇంతలా మారిపోవడానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత కాదా? అని నిలదీశారు.
బీఆర్ఎస్ తెలంగాణ శక్తి
‘తెలంగాణ శక్తి బీఆర్ఎస్, తెలంగాణ బలం బీఆర్ఎస్, తెలంగాణ గళం బీఆర్ఎస్, తెలంగాణ దళం బీఆర్ఎస్’ అని కేసీఆర్ వివరించారు. బీఆర్ఎస్కు శక్తి ఉంటేనే తెలంగాణకు శక్తి ఉంటుందని చెప్పారు. మహిళలకు రూ. 2500 వచ్చాయా? అని ప్రశ్నించిన బీఆర్ఎస్ అధినేత.. పథకాలు అమలు కావాలంటే పిడికిలి బిగించాలని, పోరాటం చేసి ప్రభుత్వం మెడలు వంచాలని పేర్కొన్నారు. బీఆర్ఎస్కు భయపడి రైతుబంధు ఎట్ల వేస్తున్నరో, అలాగే అన్నీ రావాలంటే బీఆర్ఎస్ గెలవాల్సిందేనని స్పష్టం చేశారు. డిసెంబర్ 9న 10.30 గంటలకు రుణమాఫీ అన్న రేవంత్రెడ్డి మాటలు ‘రేపు మా ఇంట లడ్డూల భోజనం’ అన్న బోర్డులాగానే ఉన్నదని కేసీఆర్ ఎద్దేవా చేశారు. ఎన్నడు చూసినా ఆ బోర్డుపై రేపు అనే ఉంటదని తెలిపారు. బాసరకు పోయి సరస్వతి అమ్మవారి మీద, యాదగిరిగుట్టకు పోయి అక్కడ.. ఇలా ఎక్కడిపోతే అక్కడ దేవుళ్ల మీద ఓట్లు పెడుతున్నాడని, దేవుళ్ల మీద ఒట్లు.. కేసీఆర్ మీద తిట్లు అన్నట్టుగా ఈ సీఎం తీరు ఉన్నదని ఎద్దేవా చేశారు. ఈ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ మెడలు వంచి రుణమాఫీ చేసే వరకు కొట్లాడాలంటే నిజామాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ను గెలిపించాలని పిలుపునిచ్చారు.
మైనార్టీ సంక్షేమానికి పెద్దపీట
బీజేపీ చాలా ఖతర్నాక్ పార్టీ అని, గతంలో బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే ఎన్ని మోసాలు చేశాడో అందరికీ తెలుసని కేసీఆర్ విమర్శించారు. బీజేపీని ఓడించేందుకు ఇప్పుడు సమయం వచ్చిందని పేర్కొన్నారు. గతంలో బీజేపీతో కలిసి బీఆర్ఎస్ను కాంగ్రెస్ ఓడించిందని ఆరోపించారు. ముస్లింల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.12వేల కోట్లు ఖర్చుచేసిందని గుర్తుచేశారు. ముస్లిం విద్యార్థుల కోసం రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేశామని, ఎంతోమంది అందులో చదివి డాక్టర్లు, ఇంజినీర్లు అవుతున్నారని, అవన్నీ కండ్లముందే ఉన్నాయని, అందరికీ తెలుసని వివరించారు. విద్యతోనే ముస్లింల జీవితాలు మారుతాయనే గురుకులాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఇప్పుడు రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయో గమనించాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిందుకు బాధేమీ లేదని, తెలంగాణ కోసం, అన్ని వర్గాల ప్రజల కోసం కొట్లాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్సేనని, మరో పార్టీ కొట్లాడబోదని పేర్కొన్నారు.
గుజరాత్ మాడల్లో ఏమున్నది?
నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ 20శాతం వెనకబడి ఉన్నదని, బీఆర్ఎస్ 6 శాతం ఓట్ల ఆధిక్యంతో ముందుకు పోతున్నదని కేసీఆర్ తెలిపారు. కాంగ్రెస్కు ఓట్లు వేసినా ప్రయోజనం ఉండబోదని, ఓట్లు చీలిపోతే మరోసారి అనవసరంగా బీజేపీ గెలిచే ప్రమాదముందని హెచ్చరించారు. ‘నరేంద్రమోదీ బడే భాయ్. నేను చోటా భాయ్. గుజరాత్ మోడల్ తీసుకొస్తా’ అని సీఎం అంటున్నాడని కేసీఆర్ విమర్శించారు. ‘ఏ మాడల్ తీసుకొస్తావ్. జీవితాలను తగలబెట్టే మాడల్ను తీసుకొస్తావా’ అంటూ నిప్పులు చెరిగారు. గుజరాత్ మాడల్లో ఏమీలేదని, చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు. ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించాలని సూచించారు. ‘బీజేపీ, కాంగ్రెస్ చెప్పేదంతా వట్టిదే. మన నీళ్లు కాపాడుకోవాలె. బతుకులు నిలబెట్టుకోవాలె. తెచ్చుకున్న రాష్ర్టాన్ని మరింత తెలివికి తెచ్చుకోవాలె. మళ్లా ఈ కరెంటు కోతలు బంద్కావాలె. చదువుకునే పిల్లలకు న్యాయం జరగాలంటే కచ్చితంగా బీఆర్ఎస్ గెలవాలి’ అని కేసీఆర్ స్పష్టం చేశారు. ఎన్నికల సందర్భంలో చెప్పినట్టుగానే యువత ఆవేశంలో ఓటు వేయకుండా, ప్రజాస్వామ్య పరిణితితో, విజ్ఞతతో ఆలోచించి ఎవరు గెలిస్తే మంచిది? ఎవరి చేతిల్లో ఉంటే రాష్ట్ర భవిష్యత్కు మంచిది అనే విషయాలను కూలంకషంగా చర్చించి, బీఆర్ఎస్ను గెలిపించాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ ఆత్మబంధువు కేసీఆర్
‘నేను కూడా హిందువునే. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ ప్రజల ఆత్మబంధువు కేసీఆర్. ఏ ఒక్క వర్గానికో కాదు. తెలంగాణలో ఉన్న ప్రజలందరూ బాగుపడాలె. అన్నివర్గాలు మంచిగుండాలె. హిందూ, ముస్లిం భాయ్.. భాయ్ అని ఉండాలె. కలిసి బతకాలె. దానిలోనే గొప్పతనం ఉంటది. బలముంటది కానీ ప్రజలను విడదీసి, మతవిద్వేషాలు రెచ్చగొడితే వచ్చేదేమీ ఉండదు. మీ ఎంపీ నోరెతెరిస్తే ఎటువంటి మాటలు ఉంటయో తెలుసు. ఎంతటి గందరగోళముంటదో తెలుసు’ అని పేర్కొన్నారు.
ప్రాంతీయ శక్తులదే అధికారం
‘నరేంద్రమోదీకి 400 సీట్లు వస్తాయని అంటున్నరు కానీ అంతా వట్టిదే. 200 సీట్లు వస్తేనే ఎక్కువని వార్తలు వస్తున్నాయి. బీజేపీ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేదే లేదు. ప్రాంతీయ శక్తులు ఏర్పాటు చేసే గవర్నమెంటే రాబోతున్నది. కాబట్టి మనం 14 ఎంపీలను గెలుచుకుంటే తెలంగాణ కేంద్ర రాజకీయాల్లో కీలకంగా మారుతుంది. రాష్ట్రంలో బీజేపీ అభ్యర్థులందరినీ ఓడించింది బీఆర్ఎస్ పార్టీనే. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కవుతాయి. రాత్రికి రాత్రి ఒక్కటవుతాయి. ఆ మోసం కూడా చేశాయి. ప్రభుత్వం దిగివచ్చి ఇవాళ రైతులకు రైతుబంధును ఎట్లయితే వేస్తున్నదో? అదేవిధంగా అన్ని హామీలు అమలు కావాలంటే? కరెంటు సక్కగ రావాలంటే? విద్యార్థులకు న్యాయం జరగాలంటే, కృష్ణా గోదావరి నీళ్లు మనయ్ మనకు దక్కాలంటే బీఆర్ఎస్ గెలవాలి. బీఆర్ఎస్ అయితే పేగులు తెగేవరకూ కొట్లాడుతది. ఏమరుపాటున ఉండకుండా బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ను గెలిపించాలి’ అని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.
బీడీ కార్మికులు అండగా నిలవాలి
ప్రాణాలకు తెగించి తీసుకొచ్చిన రాష్ర్టాన్ని పొదరిల్లులా తీర్చుదిద్దుకున్నామని, అన్ని వర్గాలను ఆదుకున్నామని కేసీఆర్ పేర్కొన్నారు. 60 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో కానీ, తెలుగుదేశం పాలనలో కానీ బీడీ కార్మికులకు అణా కూడా ఇవ్వలేదని, దేశంలో ఎక్కడా లేని విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షలమంది బీడీ కార్మికులతోపాటు టేకేదార్లకు రూ. 2 వేల పింఛన్ ఇచ్చి కాపాడిందని గుర్తుచేశారు. వారికి పింఛన్ ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని, బీజేపీ పాలిత ప్రాంతాల్లోనూ ఎక్కడా లేదని తెలిపారు. బీడీ కార్మికులందరూ నిజాయతీ చూపి బీఆర్ఎస్కు అండగా నిలవాలని కోరారు.
కేసీఆర్ బస్సులో తనిఖీలు
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సును సోమవారం పోలీసులు తనిఖీ చేశారు. జగిత్యాల నుంచి నిజామాబాద్ రోడ్షోకు వెళ్తుండగా ఆయన బస్సును తనిఖీ చేశారు. జగిత్యాల రూరల్ మండలంలోని తాటిపల్లి గ్రామం వద్ద బస్సును ఆపిన ఎఫ్ఎస్టీ జగిత్యాల ఇన్చార్జి విజయేందర్రావు పరిశీలించారు. ఈ తనిఖీల్లో హెడ్ కానిస్టేబుల్ రాజమౌళి, కానిస్టేబుల్ సుమన్ పాల్గొన్నారు.దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో బీడీ కార్మికులు, టేకేదార్లకు రూ. 2 వేల పింఛన్ ఇచ్చినం. 60 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో కానీ, తెలుగుదేశం పాలనలో కానీ ఎవరూ ఇయ్యలే. బీజేపీ పాలిత ప్రాంతాల్లోనూ లేదు.బీడీ కార్మికులకు పింఛన్ ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ.
–కేసీఆర్
కవితను జైల్లోవేస్తే భయపడ్తనా?
మోదీని అన్నివిషయాల్లో నేను వ్యతిరేకించాను కాబట్టే నా బిడ్డ కవితను జైల్లో పెట్టిండ్రు. భయపడను. కాంప్రమైజ్ కాను. పోరాటం చేస్తడే తప్ప కేసీఆర్ ఏనాడూ లొంగిపోలేదు. ఇప్పుడు కూడా లొంగే ప్రసక్తే లేదు. -కేసీఆర్
నరేంద్రమోదీ బడే భాయ్.. రేవంత్ చోటాభాయ్. రాష్ట్రంలో గుజరాత్ మాడల్ తీసుకొస్తానని సీఎం చెప్తున్నాడు. గుజరాత్ మాడల్ అంటే ఏంది? అందులో ఏమున్నది? జీవితాలను తగలబెట్టే మాడల్ తీసుకొస్తవా?
-కేసీఆర్
నేను హిందువును.. అన్ని మతాల ఆత్మబంధువును
నేను కూడా హిందువునే. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్తు ప్రజల ఆత్మబంధువును. ఏ ఒక్క వర్గానికో కాదు. తెలంగాణలో ఉన్న ప్రజలందరూ బాగుపడాలె. అన్నివర్గాలు మంచిగుండాలె. హిందూ, ముస్లిం భాయ్.. భాయ్ అన్నట్టు ఉండాలె. కలిసి బతకాలె. దానిలోనే గొప్పతనం ఉంటది. బలముంటది. ప్రజలను విడదీసి, చీల్చి మతవిద్వేషాలను రెచ్చగొడితే వచ్చేదేమీ ఉండదు. ఎప్పటికీ బీఆర్ఎస్ పార్టీ సెక్యులర్గానే ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినందుకు బాధేమీ లేదు. తెలంగాణ కోసం, అన్ని వర్గాల ప్రజల కోసం కొట్లాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్సే. మరో పార్టీ కొట్లాడబోదు.
-నిజామాబాద్ రోడ్షోలో కేసీఆర్