Harish Rao | రాష్ట్రవ్యాప్తంగా మాజీ సర్పంచ్లను అరెస్టులు చేసి నిర్బంధించడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సర్పంచ్లు ఛలో హైదరాబాద్కు పిలుపునిస్తే.. వారిని ఎక్కడికక్కడ అరెస్టులు చేసి నిర్బంధించడం దుర్మార్గమైన చర్య అని ఖండించారు. అర్ధరాత్రి పూట దొంగలు, టెర్రరిస్టులను అరెస్టు చేసినట్లు అరెస్టు చేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు.
రాష్ట్రవ్యాప్తంగా మాజీ సర్పంచ్లను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ హైదరాబాద్లోని తిరుమలగిరి పోలీస్ స్టేషన్ ముందు శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్తో కలిసి హరీశ్రావు బైఠాయించారు. అరెస్టు చేసిన మాజీ సర్పంచ్లను విడుదల చేయాలని పోలీసు స్టేషన్ ముందు బైఠాయించారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న మాజీ సర్పంచ్ల పట్ల కర్కషంగా వ్యవహరించడంపై హరీశ్రావు ఈ సందర్భంగా మండిపడ్డారు. సర్పంచ్ల మీద కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని విమర్శించారు. అప్పులు చేసి, భార్యాపిల్లల మీదున్న బంగారం అమ్మి పనులు చేశామని, పెండింగ్ బిల్లులు చెల్లించాలని మాజీ సర్పంచులు అడిగితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దునిద్ర నటిస్తున్నదని విమర్శించారు.
కేసీఆర్ నాయకత్వంలో గ్రామాల అభివృద్ధికి సర్పంచ్లు ఎంతో కృషి చేశారని హరీశ్రావు తెలిపారు. ఉత్తమమైన గ్రామాలకు తెలంగాణ కేరాఫ్ అడ్రస్గా నిలిచిందంటే, ప్రధాని అవార్డులు, పంచాయతీ అవార్డులు సాధించిందంటే అందులో సర్పంచుల పాత్ర కీలకమని అన్నారు. మంచి పనులు చేసిన సర్పంచులకు ఎందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శిక్ష వేస్తున్నారని మండిపడ్డారు. బడా కాంట్రాక్టర్లకు వందల కోట్ల బిల్లులు చెల్లిస్తున్నారని.. కానీ పనులు చేసిన పాపానికి పేద సర్పంచులు శిక్ష అనుభవించాలా అని ప్రశ్నించారు.
లక్షా 50వేల కోట్లతో మూసీని బాగు చేస్తానని అంటున్నావు. కానీ గ్రామాలను ఎంతో అభివృద్ధి చేసిన సర్పంచులకు ఎందుకు శిక్ష వేస్తున్నావని సీఎం రేవంత్ రెడ్డిని హరీశ్రావు ప్రశ్నించారు. ప్రభుత్వం వచ్చి 10 నెలలు దాటింది పది లక్షల బిల్లులు కూడా వారికి చెల్లించలేదని అన్నారు. నాలుగైదు సారు హైదరాబాద్కు వచ్చి మొర పెట్టుకున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి లేదా పంచాయతీ శాఖ మంత్రి సర్పంచులను చర్చలకు పిలవాలని.. పెండింగ్ బిల్లులను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు.