BRS Leader Dasoju Sravan | హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ) : 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న కేసీఆర్ కావాలా ? కేవలం ఐదు గంటలు, మూడు గంటలు పవర్ ఇస్తామన్నా రేటేంత రెడ్డి కాంగ్రెస్ కావాలా? కర్ణాటక కాంగ్రెస్ కావాలా ? తెలంగాణ సమాజం అలోచించాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ కుమార్ అన్నారు. ఉచిత కరెంట్ విషయంలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్వయంగా దొంగలా పట్టుబడ్డారని, తాము ఐదు గంటల కరెంటే ఇస్తున్నామని స్వయంగా డీకే చెప్పడం తెలంగాణ సమాజం అంతా ప్రత్యేక్షంగా చూసిందని శ్రవణ్ అన్నారు.
ఆదివారం తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ తెలంగాణలో కొన ఊపిరితో వున్న కాంగ్రెస్ పార్టీ పక్క రాష్ట్రాలు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి నాయకులని తెప్పించి అసత్య ప్రచారాలతో తెలంగాణ ప్రజలని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో జరిగిన అభివృద్ధిని ఓర్వలేక, ఎదురోలేక కాంగ్రెస్ నాయకులు మాయమాటలతో ప్రజలని ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. డీకే శివకుమార్ మాటలు చూస్తుంటే `గుడ్డొచ్చి పిల్లను ఎక్కిరించిందట? అనే సామెత గుర్తుకు వస్తుంది` అని ఎద్దేవా చేశారు.
సీఎం కేసీఆర్ను కర్ణాటకకు రమ్మని సవాల్ చేసిన ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్.. తెలంగాణలో ఏదైనా ఇంటిని సందర్శించి, ఏ ముసలవ్వనైనా పెన్షన్ ఎంత వస్తుందని అడిగితే డీకే మూతి పగలగొట్టె సమాధానం ఇస్తారని దాసోజు శ్రవణ్ స్పష్టం చేశారు.`కర్ణాటకలో రైతు బంధు లేదు, బీమా లేదు, రుణమాఫీ లేదు. మరి ఏ మొహంతో తెలంగాణలో ప్రచారం చేస్తున్నారు ?` అని ధ్వజమెత్తారు. `దేశంలో స్వచ్చమైన మంచి నీరు అందించే నెంబర్ వన్ స్టేట్ తెలంగాణ. కర్ణాటక 20 స్థానంలో వుంది. డీకె ఏ మొహం పెట్టుకొని తెలంగాణ గురించి మాట్లాడుతున్నారు ? ఏ మొహంతో ఓటు అడుగుతున్నారు?` అని దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు.
`నేడు తెలంగాణ పల్లెలు పట్టుకొమ్మలుగా మారాయి. ప్రతి పల్లెలో సూళ్లు, పార్కులు, చెరువులు, క్రీడా ప్రాంగణాలు, వైకుంఠధామాలు, ప్రకృతి వనాలు, అన్నీ మౌలిక వసతులతో పల్లెలు స్వర్గధామాలుగా మారాయి. మహాత్మా గాంధీజీ కలలు గ్రామస్వరాజ్యం సాకారమైంది` అని దాసోజ్ శ్రవణ్ చెప్పారు. మరి కర్ణాటక పరిస్థితి ఏమిటి? జాతీయ పంచాయితీ అవార్డుల్లో తెలంగాణ గ్రామాల అభివృద్ధి చూసి ఎనిమిది జాతీయ అవార్డులు వస్తే .. కర్ణాటకకి ఒక అవార్డు కూడా రాలేదు` అని పేర్కొన్నారు.
`రాష్ట్రమంతా మరుగుదొడ్లు వున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, మరి మీ పరిస్థితి ఏమిటి? సొంత ఇంటిని బాగు చేసుకోలేని డీకే ఇక్కడకొచ్చి తెలంగాణపై బురద జల్లే ప్రయత్నం మానుకోవాలి` అని దాసోజ్ శ్రవణ్ సూచించారు. `ఒకడు ఓటుకు నోటు దొంగ, ఇంకొకడు వేలకోట్లు దోచుకొని సీబీఐకి దొరికిన గజదొంగ అని, వీళ్ళు తెలంగాణని అభివృద్ధి చేస్తామంటే ఎలా నమ్మాలి` అంటూ దాసోజు ప్రశ్నించారు.
సొంతపార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే దానికి రేట్ కార్డ్ పెట్టిన నాయకుడు రేటెంత రెడ్డి` అని దాసోజు శ్రవణ్ అన్నారు. సొంత పార్టీ నాయకులకే టికెట్లు అమ్ముకునే నాయకుడు.. రాష్ట్రాన్ని ఏ రకంగా అమ్మకుతింటాడో ప్రజలు దయచేసి అర్ధం చేసుకోవాలి` అని కోరారు. తోడేళ్ళు, నక్కలు, మిడతల దండులా వచ్చి దాడి చేసి తెలంగాణని దోచుకుతినాలని ప్రయత్నిస్తున్న రేటెంత రెడ్డి, డికే శివకుమార్ లాంటి గజదొంగలకు సరైన గుణపాఠం చెప్పాలి’ అని తెలంగాణ ప్రజలకు దాసోజు శ్రవణ్ పిలుపునిచ్చారు.