Vinod Kumar | టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత తొలి సభ కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ గ్రౌండ్స్లోనే జరిగిందని బీఆర్ఎస్ నాయకుడు బోయిన్పల్లి వినోద్కుమార్ అన్నారు. తెలంగాణ ఉద్యమం ఉధృతమవుతుందని విశ్వాసాన్ని యావత్ ప్రపంచానికి తెలియజేసిన గడ్డ ఇది అని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు పార్లమెంటు ఎలక్షన్స్ కోసం తొలి సభను కూడా కరీంనగర్లోనే నిర్వహిస్తున్నామని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల సమర శంఖం పూరించేందుకు కరీంనగర్లో నిర్వహించిన కదనభేరీలో బోయిన్పల్లి వినోద్ కుమార్ మాట్లాడారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఎందుకు ఓటెయ్యాలో వివరించారు.
కేంద్రంలో బీజేపీ ఉంది.. రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది.. ఎందుకు గులాబీ జెండా అవసరమని చాలామంది అడుగుతున్నారని వినోద్కుమార్ తెలిపారు. కానీ ఇప్పుడే గులాబీ జెండా అవసరం చాలా ఉందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ కోసం.. తెలంగాణ ప్రజల సంక్షేమం.. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం గులాబీ జెండా ఎంపీలు పార్లమెంటులో ఉండాలని అన్నారు. బీజేపీ, కాంగ్రెసోళ్లు రాష్ట్రాన్ని ఏం చేస్తారో తెలియదని ఆందోళన వ్యక్తం చేశారు. నాడు చంద్రబాబు మాట విని బీజేపీ ప్రభుత్వం తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో కలిపేసిందని బోయిన్పల్లి వినోద్కుమార్ గుర్తుచేశారు. అప్పుడు కేసీఆర్ ఆదేశాల మేరకు పార్లమెంటులో గొంతు చించుకుని పార్లమెంటును వాయిదా వేయించామని తెలిపారు. గులాబీ జెండా శ్రేణులకు, బీఆర్ఎస్ ఎంపీలకు అంత శక్తి ఉందని అన్నారు. ఆ తర్వాత చాలా విషయాలపై పార్లమెంటులో పోరాటం చేశామని చెప్పారు.
బండి సంజయ్ ఐదేండ్లలో ఐదు రూపాయలు తెచ్చాడా?
మోదీ ప్రధానిగా పదేండ్లుగా ఉన్న సమయంలో కరీంనగర్ నుంచి తాను ఐదేండ్లు ఎంపీగా ఉంటే.. బండి సంజయ్ మరో ఐదేండ్లు ఎంపీగా ఉన్నారని బోయిన్పల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. ఎంపీగా తాను ఏం తీసుకొచ్చానో చెబుతానని.. బండి సంజయ్ ఏం తీసుకొచ్చాడో చెప్పాలని డిమాండ్ చేశారు. ఐదేండ్లలో ఐదు రూపాయలు కూడా తీసుకురాలేదని ఎద్దేవా చేశారు. స్మార్ట్ సిటీ పేరుతో కరీంనగర్ అభివృద్ధి కోసం వెయ్యి కోట్లు తీసుకొచ్చామని చెప్పారు. కేసీఆర్ కరీంనగర్ ఎంపీగా ఉన్నప్పుడు.. కరీంనగర్ జిల్లాకు హైదరాబాద్కు నేరుగా రైలు కావాలని సర్వే చేయించారని చెప్పారు. కానీ అప్పుడు యూపీఏ ప్రభుత్వం నుంచి బయటకు రావడంతో దాన్ని ఎవరూ పట్టించుకోలేదని అన్నారు. 2014లో తాను ఎంపీ అయినప్పుడు కేసీఆర్ సూచన మేరకు మళ్లీ దానిపై కొట్లాడామని పేర్కొన్నారు. కరీంనగర్కు ఐదు జాతీయ రహదారులు ప్రతిపాదన చేశామని.. ఇప్పుడు రెండింటి పనులు అవుతున్నాయని చెప్పారు. బండి సంజయ్ కరీంనగర్కు ఏం చేశాడని నిలదీశారు. కరీంనగర్కు ఐఐటీ కోసం తాను చివరిదాకా పోరాడానని.. కానీ బండి సంజయ్ ఎంపీ అయ్యాక దాని ఊసే లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
బీజేపీని ఎందుకు గెలిపించాలి?
బీజేపీ వాళ్లను తెలంగాణ ప్రజలను ఎందుకు గెలిపించాలని బోయిన్పల్లి వినోద్కుమార్ ప్రశ్నించారు. ఒకరు కేంద్రమంత్రి, ముగ్గురు ఎంపీలు తెలంగాణకు ఏం చేశారని నిలదీశారు. తెలంగాణ, కరీంనగర్ సమస్యలపై పార్లమెంటులో తాను 106 సార్లు మాట్లాడానని గుర్తు చేశారు. బీఆర్ఎస్ నాయకులు పదే పదే నిలదీస్తే తాను ఏం చేశానో చెబుతూ బండి సంజయ్ ఫ్లెక్సీలు పెట్టారని అన్నారు. అందులో జాతీయ ఉపాధి హామీ పథకం కింద 90 కోట్లు తీసుకొచ్చానని చెప్పాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ ఉపాది హామీ పథకం 20 ఏండ్ల కిందట మన్మోహన్ ప్రధానిగా ఉన్న సమయంలో వచ్చిందని.. దానికి బండి సంజయ్కు ఏంటి సంబంధమని ప్రశ్నించారు. అంగన్వాడీల ద్వారా ఆడబిడ్డలకు పోషకాహారం అందించడం కూడా తానే తీసుకొచ్చానని బండి సంజయ్ చెబుతున్నారని.. కానీ అది నెహ్రూ టైమ్లోనే వచ్చిందని చెప్పారు. బండి సంజయ్ పార్లమెంటు సభ్యుడిగా ఒక్క పని అయినా చేశాడా? అని నిలదీశారు. పనిచేసేవాళ్లు ఉండాలా? గాలి మాటలు మాట్లాడేవాళ్లు ఉండాలా? ఎంపీగా ఎవరు ఉండాలనేది ప్రజలు చర్చ పెట్టుకోవాలని వినోద్కుమార్ కోరారు.
ఇదేమైనా పునరావాస కేంద్రమా?
బండి సంజయ్ ఎమ్మెల్యేగా ఓడిపోతే ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నారని అన్నారు. చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యేగానే ప్రయత్నం చేయాలి.. కానీ ఎంపీగా ఎందుకొస్తున్నావ్ అని బండి సంజయ్ను ప్రశ్నించారు. ఇదేమైనా పునరావాస కేంద్రమా? అని నిలదీశారు. కేసీఆర్ను అడిగితే నాకు ఎమ్మెల్యే సీటు ఇచ్చేవాడు కాదా.. కానీ నేను పార్లమెంటులోనే ఉండాలి.. పార్లమెంటు ద్వారానే నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలని అంకిత భావంతో ఉన్నానని తెలిపారు. సానుభూతి పేరుతో డ్రామాలు ఆడే నీకు ఎందుకు ఓటేయ్యాలి అని ప్రశ్నించారు.
ప్రజలు మళ్లీ మార్పు కోరుకుంటున్నారు.. కేసీఆర్ రావాలని అనుకుంటున్నారు
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపైనా బోయిన్పల్లి వినోద్కుమార్ నిప్పులు చెరిగారు. అబద్ధాల పునాదిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని ఆయన విమర్శించారు. అన్ని హామీలు ఇచ్చారు కానీ.. ఏ ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదని అన్నారు. ‘ మార్పు జరగాలి.. మార్పు జరగాలి అంటే మార్పు జరిగింది.. ఏం మార్పు జరిగిందంటే ప్రజలు ఏడుస్తున్నరు.. పంటలు ఎండిపోతున్నయి, ధర్నాలు చేస్తున్నరు.. పంటలు కాలబెట్టుకుంటున్నారు’ అని తెలిపారు. మార్పు అంటే ఇది కాదని స్పష్టం చేశారు.
కేసీఆర్ మొన్న ముఖ్యమంత్రి అయ్యి ఉంటే.. మేడిగడ్డ దగ్గర కూర్చొని ఇంజనీర్లకు చెప్పి ఒక కాపర్ డ్యామ్ కట్టిస్తుండే అని అన్నారు. అవసరమైతే కాపర్ డ్యామ్ కట్టించి మిడ్ మానేరు, ఎల్ఎండీతో పాటు చెరువులు, కుంటలు నింపి.. ఇప్పుడిప్పుడే పొట్టకొస్తున్న వరిని కాపాడే వారని అన్నారు. రైతులను బాగుపరిచే నాయకుడు కేసీఆర్ ఒక్కరే అని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గుర్తించారని తెలిపారు. మార్పు అంటే ఇది అనుకోలేదని.. మళ్లీ మార్పు రావాలని.. మళ్లీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారని అన్నారు. ఇదే స్ఫూర్తితో పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులను గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. రానున్న ఐదేండ్లలో పార్లమెంటు సమావేశాలప్పుడు ఢిల్లీలో ఉంటా.. రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడుతానని తెలిపారు. పార్లమెంటు సమావేశాలు లేనప్పుడు నియోజకవర్గంలోనే ఉంటానని చెప్పారు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేదాకా ఊరూరు తిరిగి పార్టీని బలోపేతం చేస్తానని హామీ ఇచ్చారు.