వరంగల్, మే 29(నమస్తేతెలంగాణ) : తెలంగాణ కళలు, చరిత్రపై వ్యతిరేకతతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలంగాణ చరిత్రనే మార్చే కుట్ర చేస్తున్నారని, ఆయన పచ్చి సమైక్యవాది అని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ నేత బోయినపల్లి వినోద్కుమార్ మండిపడ్డారు. రాష్ట్ర అధికారిక చిహ్నంలో కాకతీయతోరణం, చార్మినార్ను తొలగిస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ ఊరుకునేది లేదని, అవసరమైతే తాను న్యాయ పోరాటం చేస్తానని ప్రకటించారు. రేవంత్ తీసుకున్న రాష్ట్ర చిహ్నం మార్పు నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అధికారిక చిహ్నంలో మార్పులపై సీఎం నిర్ణయం అమల్లోకి వస్తే దేశ చిహ్నంపై మొదటి ప్రధాని నెహ్రూ తీసుకున్న నిర్ణయాన్ని మరిపించే శక్తులకు బలం చేకూరుతుందని చెప్పారు.
దేశం చిహ్నం, జాతీయ జెండాలో అశోకచక్రం ఉండటం నెహ్రూ నిర్ణయమేనని, రాష్ట్ర చిహ్నంలో కాకతీయ తోరణం, చార్మినార్ను తొలగిస్తే రేపు దేశ చిహ్నం, జాతీయ జెండాలోని అశోకచక్రాన్ని కూడా తొలగించాలనే డిమాండ్ బలంగా వస్తుందని, ఈ నేపథ్యంలో రేవంత్రెడ్డి నిర్ణయాన్ని సోనియాగాంధీ అంగీకరిస్తారా? అని ప్రశ్నించారు. రాష్ట్ర చిహ్నంలో కాకతీయ తోరణం, చార్మినార్ను తొలగించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం సాయంత్రం ఖిలావరంగల్లోని కాకతీయ కీర్తి తోరణాల వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు, తెలంగాణవాదులు, వరంగల్వాసులు భారీ సంఖ్యలో తరలివచ్చి నిరసన గళం వినిపించారు.
తెలంగాణ అస్తిత్వాలైన కాకతీయతోరణం, చార్మినార్ గుర్తులను తొలగిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. స్థానిక మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వినోద్కుమార్ మాట్లాడుతూ రేవంత్రెడ్డి సీఎం అయ్యాక ఒక్కసారి కూడా జై తెలంగాణ అనలేదని, జై సోనియాగాంధీ, జై రాహుల్గాంధీ అని మాత్రమే అంటున్నాడని, రేవంత్రెడ్డి వెనుక తెలంగాణ వ్యతిరేక శక్తులున్నాయని విమర్శించారు. కేసీఆర్ నాయకత్వంలోని పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన తెలంగాణ అభివృద్ధిని వ్యతిరేక శక్తులు ఓర్వలేకపోతున్నాయని ధ్వజమెత్తా రు. కేసీఆర్ వల్లే తెలంగాణ ఆదా యం పెరిగిందని స్పష్టంచేశారు. రేవంత్రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబులది గురుశిష్యుల బంధమని, తెలంగాణ ఉద్యమ సమయంలో రేవంత్రెడ్డి తుపాకీ పట్టుకుని తిరుగుతూ ఉద్యమకారులను బెదిరించారని, కరీంనగర్లో చంద్రబాబు వెంట రేవంత్రెడ్డి తుపాకీ పట్టుకొని తిరిగాడని గుర్తు చేశారు. కాకతీయతోరణం వ్యవసాయం, ఇరిగేషన్కు చిహ్నం అని వివరించారు. నిరసనలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మాజీ ఎమ్మెల్యేలు వినయ్భాస్కర్, పెద్ది సుదర్శన్రెడ్డి, బీఆర్ఎస్ నేతలు ఏనుగుల రాకేశ్రెడ్డి, ఇండ్ల నాగేశ్వర్రావు, శోభన్బాబు తదితరులు పాల్గొన్నారు.