పులి బయటకొస్తే.. మా దగ్గర వలలు ఉన్నాయంటూ కేసీఆర్ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత బోయిన్పల్లి వినోద్కుమార్ కౌంటర్ వేశారు. ఎవరైనా వల వేసి కుందేళ్లను పడతరు.. పులిని పడతారా ఎవరైనా? అని సెటైర్ వేశారు. పులిని పట్టాలంటే ట్రంక్విలైజర్స్తో మత్తు మందిచ్చి.. అప్పుడు పులిని పడతారని వివరించారు. ఏది పడితే అది మాట్లాడతరా? అని మండిపడ్డారు. కరీంనగర్లో నిర్వహించిన నియోజకవర్గస్థాయి బీఆర్ఎస్ ముఖ్య నాయకుల విస్తృత స్థాయి సమావేశంలో వినోద్కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేం రాజ్యాధికారం కోసం పార్టీ పెట్టలేదు.. రాష్ట్రం సాధించాలని పార్టీ పెట్టామని కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు స్పష్టం చేశారు.
వలవేసి కుందేళ్లను పడతారు కానీ…పులిని వలవేసి ఎలా పడతారో రేవంత్ రెడ్డి గారికే తెలియాలి.#brspartyonline #Boianapallivinodkumar #KCR #revanthreddyanumula #Telangana #GangulaKamalakar #karimnagar pic.twitter.com/fkY0w2YQ0H
— B Vinod Kumar (@vinodboianpalli) January 21, 2024
రాబోయే పార్లమెంట్ ఎన్నికల కోసం కరీంనగర్ కేంద్రంగానే తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ వ్యూహరచన చేయబోతున్నారని బోయినపల్లి వినోద్కుమార్ స్పష్టం చేశారు. ఆచరణకు సాధ్యం కాని హామీలు, అబద్ధాల పునాదిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలనే ఉద్దేశం బీఆర్ఎస్ పార్టీకి లేదని స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారని అన్నారు. 2014 నుంచి 2019 వరకు తాను ఎంపీగా ఉన్న సమయంలో కరీంనగర్ పట్టణాన్ని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసేందుకు వెయ్యి కోట్లు తీసుకొచ్చానని గుర్తుచేశారు. కానీ బండి సంజయ్ మాత్రం నయాపైసా తీసుకురాలేదని విమర్శించారు. కరీంనగర్ అభివృద్ధి కోసం ఐదు కొత్తలు తీసుకురాలేని బండి సంజయ్కు ప్రజలు ఓట్లు ఎలా వేస్తారని వ్యాఖ్యానించారు.
మేం రాజ్యాధికారం కోసం పార్టీ పెట్టలేదు.. రాష్ట్రం సాధించాలని పార్టీ పెట్టామని కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు బోయినపల్లి వినోద్కుమార్ స్పష్టం చేశారు. అన్నట్టుగా రాష్ట్రాన్ని సాధించినం అని చెప్పారు. ‘ తెలంగాణను అభివృద్ధి దశకు తీసుకెళ్తామని అనుకున్నం.. తీసుకెళ్లినం, 24 గంటల కరెంట్ ఇస్తామని చెప్పినం.. ఇచ్చి చూపించినం, కృష్ణా, గోదావరి నీళ్లను కోటి ఎకరాలకు తీసుకొస్తామని చెప్పినం.. తీసుకొచ్చి చూపినం, సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పినం.. ఇచ్చి చూపినం’ అని వివరించారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ప్రజల తీర్పును శిరసావహిస్తామని పేర్కొన్నారు.