గంభీరావుపేట, ఏప్రిల్ 17: ‘గత పదేండ్లలో మోదీ సర్కారు దేశానికి ఒరగబెట్టిందేమీ లేదు. అంతకుముందు ఉన్న ప్రభుత్వాల పునాదులమీదే ప్రభుత్వాన్ని నడుపుతున్నది. ఇక రాష్ట్రంలో ఆచరణ సాధ్యంకాని హామీలు ఇచ్చి, అబద్ధాల పునాదిపై కాంగ్రెస్ గద్దెనెక్కింది. ఈ రెండు పార్టీలు కూడా చెప్పింది చేస్తలేవు. మాటల గారడీతో ప్రజలను మోసం చేస్తున్నవి’ అని బీఆర్ఎస్ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బీ వినోద్కుమార్ మండిపడ్డారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ తెలంగాణకు చేసిందేమీ లేదని విమర్శించారు. రాష్ట్రంలో కృష్ణా, గోదావరి నదులపై కట్టిన ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించలేదని, రాష్ట్రంలో నలుగురు బీజేపీ ఎంపీలున్నా ఈ విషయమై ఒక్క రోజూ పార్లమెంట్లో మాట్లాడిన పాపానపోలేదని దుయ్యబట్టారు. ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారో? చెప్పాలని నిలదీశారు.
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి పార్లమెంట్కు పంపిస్తే రాష్ర్టాన్ని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 లక్షల రుణమాఫీ, వరికి రూ.500 బోనస్, పింఛన్ల పెంపు, కల్యాణలక్ష్మి కింద తులం బంగారం, రూ.లక్ష సాయం ఎప్పుడు అమలు చేస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. గంభీరావుపేటలో 700 ఏండ్ల నాటి అతి పురాతనమైన సీతారాముల ఆలయంలో స్వామివారి కల్యాణోత్సవంలో పాల్గొనడం సంతృప్తిగా ఉందని పేర్కొన్నారు.