BRS Party | కాంగ్రెస్లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలని పిటిషన్ సమర్పించేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. ఈ క్రమంలో సాయంత్రం ఆరుగంటలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ అపాయింట్మెంట్ ఇవ్వడంతో ఆయన ఇంటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్ వెళ్లారు. స్పీకర్ సాయంత్రం 6 గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చి అందుబాటులో లేరు.
రాత్రి 8.30 గంటల వరకు ఆయన కోసం ఎమ్మెల్యేలు నిరీక్షించారు. ఇంట్లో లేకపోవడంతో స్పీకర్కు ఎమ్మెల్యేలు ఫోన్ చేసినా స్పందించలేదు. దాంతో రెండున్నర గంటలు స్పీకర్ నివాసం వద్ద నిరీక్షించి వెనుదిరిగారు. స్పీకర్ అపాయింట్మెంట్ ఇచ్చి తమను కలవకపోవడం బాధాకరమని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి అన్నారు. సీఎం రేవంత్రెడ్డి ఒత్తిడితోనే తమను కలువలేదని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ఆరోపించారు. సోమవారం మరోసారి స్పీకర్కు దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలని పిటిషన్ సమర్పించేందుకు ప్రయత్నిస్తామని పాడి కౌశిక్రెడ్డి పేర్కొన్నారు.