నల్గొండ : తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్న బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్లగొండలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో చిట్ చాట్గా మాట్లాడారు. ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగాయని వెల్లడించారు.
దేశం,రాష్ట్రాలలో నెలకొన్న తాజా పరిస్థితిపై సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగం సామాన్య ప్రజలకు అర్ధం అయ్యే విధంగా ఉందని వివరించారు.దేశ ఆర్ధిక పరిస్థితులు బాగుపడాలి. వ్యవసాయ రంగం ఫునర్జీవం పొందాలని లక్ష్యంతో ముందుకుసాగుతున్న కేసీఆర్ వెంట దేశ ప్రజలు నడవాలని భావిస్తున్నారని అన్నారు. తెలంగాణ భవిష్యత్ మొత్తం కేసీఆర్, బీఆర్ఎస్ చేతిలో మాత్రమే సురక్షితంగా ఉంటుందని తెలిపారు.
షెడ్యుల్ ప్రకారమే తెలంగాణలో ఎన్నికలు
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావని రాజకీయ అనుభవంతో చెబుతున్నానని మండలి చైర్మన్ వెల్లడించారు. మునుగోడు ఉప ఎన్నికల మాదిరిగానే భవిష్యత్తులోనూ వామపక్షాలతో పొత్తు ఉంటుందని భావిస్తున్నానని స్పష్టం చేశారు.పార్టీ నిర్ణయం ప్రకారమే కుమారుడు గుత్తా అమిత్ పొలిటికల్ స్టెప్ ఉంటుందని తేల్చి చెప్పారు.టికెట్ల కేటాయింపు లో సర్వేల ప్రకారమే కేసీఅర్ నిర్ణయం ఉండొచ్చని అభిప్రాయ పడ్డారు.కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా పనిచేస్తుంది తప్పా సామాన్య ప్రజలకు ఒరిగబెట్టిందేమి లేదని విమర్శించారు.
‘ఆదాని లాంటి వారు ప్రభుత్వ సంస్థలను ముంచుతున్నారు. ఇది దేశానికి మంచిది కాదు.బీబీసీ లాంటి అంతర్జాతీయ మీడియా సంస్థపైన ఐటీ దాడులు దేశ ప్రతిష్టకు మంచిది కాదని’ అన్నారు.గతంలోనూ భోఫోర్ష్, రాఫెల్ లాంటి కుంభకోణాలు జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థలే బయట పెట్టాయి. మీడియాపై కుట్రలు, కుతంత్రాలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని వెల్లడించారు. బండి సంజయ్ చేసిన దండుపాళ్యం వ్యాఖ్యలు వారికే వర్తిస్తాయని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎప్పుడూ ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదని, ఆయన వ్యాఖ్యలు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.హాంగ్ వస్తుందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.