హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) వెలుపల మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో బస్తీ దవాఖాల ఏర్పాటు చురుగ్గా కొనసాగుతున్నది. మొదటి విడతలో 85, రెండో విడతలో101 బస్తీ దవాఖానాలను ప్రభుత్వం మంజూరు చేసింది. మొత్తం 92 పట్టణాభివృద్ధి సంస్థల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. 186 బస్తీదవాఖానాల్లో ఇప్పటికే 109 పనిచేస్తున్నాయి. మిగిలిన వాటిని త్వరలో ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నారు.
ఒక్కో బస్తీ దవాఖానాకు ప్రభుత్వం రూ.13.20 లక్షల చొప్పున వెచ్చిస్తున్నది. వీటి కోసం 2023-24 బడ్జెట్లో రూ.79.20 కోట్లను కేటాయించారు. బస్తీ దవాఖాల్లో 57 రకాల సేవలను రోగులకు అందిస్తారు. బస్తీల్లో సుస్తీ చేసిన వారికి టెస్టులు చేసే సౌకర్యాన్ని కల్పించారు. పేదవారు రోగాలబారిన పడితే ప్రైవేటు దవాఖానకు వెళ్లడం, టెస్టుల కోసం వేలాది రూపాయలు వెచ్చించాల్సి వస్తున్నది. వారి ఆరోగ్యాన్ని కాపాడటం, వారిపై భారం పడకుండా ఉండాలనే ఉద్దేశంతో బస్తీ దవాఖానలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అవసరమైన భవనాలను మున్సిపల్ శాఖ ఏర్పాటు చేస్తున్నది. విద్యుత్తు, వాటర్ కనెక్షన్లను అందజేస్తున్నది.
ఇక్కడికి వచ్చేవారికి ఉచితంగా పరీక్షలు చేస్తున్నారు. మందులు అందిస్తున్నారు. ఇంజెక్షన్లు ఇవ్వడం, గర్భిణులకు, పిల్లలకు అవసరమైన ఇంజెక్షన్లు, మందులు అందజేస్తున్నారు. గతంలో ప్రభుత్వ ఆసుపత్రులు దూరంగా ఉండటంతో వాటి వద్దకు వెళ్లే సమయం, రవాణా భారం తదితర కారణాలతో సమస్య తీవ్రమైతే తప్పే దవాఖానలకు వెళ్లే వారు కాదు. కొందరు ప్రైవేటు క్లినిక్లు, ఆసుపత్రులకు వెళ్లాల్సి వచ్చేది. ఇలా అనేక రకాల సమస్యలకు పరిష్కారం చూపింది బస్తీ దవాఖాన.