హైదరాబాద్: సాగునీటి రంగంపై తాము చేసిన ఖర్చు రూ.1.76 లక్షల కోట్లని, ఆ ఖర్చుతో తాము ఎన్నో నూతన ప్రాజెక్టులు నిర్మించామని, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేశామని, లక్షల ఎకరాలకు సాగునీటితోపాటు ఇంటింటికి తాగునీటి సదుపాయం కల్పించామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి గురించి శ్వేదపత్రం పేరుతో పవర్పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.
‘మాకు రాష్ట్రాన్ని అప్పజెప్పిన్నాడు పాలమూరు జిల్లాలో కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ఈ మూడు పెండింగ్ ప్రాజెక్టులుగా ఉండేవి. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి ఒక్క పాలమూరు జిల్లాలోనే 6 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చింది. అందుకు కేవలం రూ.3 వేల కోట్లు ఖర్చు చేసింది. అంతేగాక పదేళ్లలో మేం 204 టీఎంసీల రిజర్వాయర్లను నిర్మించాం. పాలమూరు-రంగారెడ్డి, సీతారామ, కాళేశ్వరం మూడు కలిపి 204 టీఎంసీల నీటి నిలువ సామర్థ్యం కలిగి ఉన్నాయి. ఈ ప్రాజెక్టులకు కాలువలు ఏర్పాటు చేస్తే రాష్ట్రం మొత్తంలో 50 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించవచ్చు. కేసీఆర్ భగీరథ ప్రయత్నంతో రూ.1000 కోట్ల ఖర్చుతో రివర్స్ పంపింగ్ చేస్తే.. కోదాడ, తుంగతుర్తి, సూర్యపేట, డోర్నకల్, మహబూబాబ్, పాలకుర్తి ఏరియాలకు కాళేశ్వరం ద్వారా సాగునీరు అందుతున్నది. అలాంటి కాళేశ్వరంలో ఒక్క బరాజ్లో ఏదో జరిగితే.. ప్రాజెక్టు మొత్తమే లోపభూయిష్టంగా ఉన్నదని బట్టకాల్చి మీద వేస్తున్నరు’ అని కేటీఆర్ ఆరోపించారు.
‘దేశంలోనే అత్యధికంగా భూగర్భ జలాలు పెంచిన ఘనత కేసీఆర్ది. తెలంగాణలో భూగర్భ జలాలు ఆరు మీటర్లు పెరిగినయ్. ఇంటింటికి నల్లాల ద్వారా తాగునీటిని అందించి మహిళలు నీళ్లకోసం కిలోమీటర్ల దూరం నడిచే దుస్థితి తప్పించినం. ఈ పనులన్నింటికి ఎట్ల వెలగడ్తరని నేను ప్రశ్నిస్తున్నా. కాళ్వేరం ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టులో చిన్న లోపం తలెత్తితే ప్రాజెక్టు మొత్తాన్నే బద్నాం చేస్తున్నరు. ప్రాజెక్టులో నిజంగా లోపాలు ఉంటే ఎంక్వయిరీ చేయించండి. ఏ విచారణకైనా మేం సిద్ధంగా ఉన్నాం. మీకేమైనా కక్ష ఉంటే మాపై తీర్చుకోండి. అంతేతప్ప రాష్ట్రానికే తలమానికమైనా ప్రాజెక్టులను అవమానించకండి’ అని కేటీఆర్ అన్నారు.
‘మిషన్ భగీరథ ద్వారా రూ.37 వేల కోట్ల ఖర్చుతో ఇంటింటికి తాగునీరిచ్చినం. నల్లగొండలో ఫ్లోరోసిస్ సమస్యకు చెక్పెట్టినం. నీతి ఆయోగ్ కూడా మిషన్ భగీరథ ప్రాజెక్టును మెచ్చుకున్నది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మిషన్ భగీరథ ప్రాజెక్టును కూడా బద్నాం చేస్తున్నది. వేల కోట్లు వృథా చేసిండ్రని మాట్లాడుతున్నది. మిషన్ భగీరథ నిరర్ధకమని అంటున్నది. కాంగ్రెస్ నేతలు అసెంబ్లీలో అడ్డగోలుగా మాట్లాడుతున్నరు. ఇది భావ్యమేనా అని అడుగుతున్నా’ అని ఆయన ప్రశ్నించారు.