BRS | అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో దేశ రాజకీయాల్లోకి వచ్చిన భారత రాష్ట్ర సమితి పార్టీకి మహారాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. వినూత్న పథకాలతో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ మాడల్ అభివృద్ధి, సంక్షేమం తమకూ కావాలని మరాఠ్వాడ ప్రజలు గొంతెత్తుతున్నారు. పార్టీ తలపెట్టిన ప్రతి బహిరంగ సభనూ విజయవంతం చేస్తూ బీఆర్ఎస్ ఏర్పాటును సాదరంగా ఆహ్వానిస్తున్నారు.
(ఔరంగాబాద్ నుంచి నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి), ఏప్రిల్ 22: మరాఠ్వాడాకు కేంద్రమైన ఛత్రపతి శంభాజీనగర్ ఔరంగాబాద్లో సోమవారం నిర్వహించనున్న బహిరంగ సభకు ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తున్నది. దేశ చరిత్రను మార్చబోతున్న బీఆర్ఎస్ పార్టీలో తామూ భాగస్వామ్యం అయ్యేందుకు మహారాష్ట్రలోని వివిధ పార్టీలకు చెందిన నేతలు క్యూ కడుతున్నారు. ఔరంగాబాద్ చుట్టుపక్కల నియోజక వర్గాల్లోని గ్రామాల్లో బీఆర్ఎస్ డిజిటల్ ప్రచార రథాలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాలు ఆకర్శిస్తున్నాయి.
బీఆర్ఎస్ బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు సాగుతున్నాయి. మహారాష్ట్రలో తలపెట్టిన మూడో సభకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నదని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. ఔరంగాబాద్లోని బీడు బైపాస్ రోడ్డులోని జబిందా మైదాన్లో సభకు జరుగుతున్న ఏర్పాట్లను శనివారం జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి, తెలంగాణ ఐడీసీ చైర్మన్, మాజీ కేంద్ర మంత్రి ఎస్ వేణుగోపాలాచారి, బీఆర్ఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి హిమాంశు తివారీ, బీఆర్ఎస్ కిసాన్ సమితి మహారాష్ట్ర అధ్యక్షుడు మాణిక్ కదం, మహారాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు హర్షవర్ధన్ జాదవ్, ప్రవీణ్ జథేవాడ్, శంకరన్నా ధోండ్గే తదితరులు సమీక్షించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. మరాఠ్వాడకు ముఖ్యకేంద్రమైన ఔరంగాబాద్లో బీఆర్ఎస్ సభ ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నదని పేర్కొన్నారు. రైతు ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్న ఈ ప్రాంతంలో ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అన్న బీఆర్ఎస్ నినాదం విస్తృత చర్చకు కారణమతున్నదని చెప్పారు.
ఛత్రపతి శంభాజీనగర్ ఔరంగాబాద్ జిల్లాకు చెందిన పలు పార్టీలకు చెందిన ప్రముఖ నాయకులు బీఆర్ఎస్లో చేరనున్నారని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హిమాన్షు తివారీ తెలిపారు. ఇప్పటికే పలువురు హైదరాబాద్ వెళ్లి బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ను కలిసి, మద్దతు ప్రకటించారని చెప్పారు. జిల్లాలోని 9 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోంచి ప్రముఖ నాయకులు పార్టీలో చేరుతున్నారని వెల్లడించారు. ఔరంగాబాద్లో 3 అసెంబ్లీ నియోజక వర్గాలు(తూర్పు, మధ్య, పశ్చిమ), గంగాపూర్ కుల్తాబాద్, పులెంబ్రి, పాఠన్, సిలోడ్, కన్నాడ్, వైజాపూర్ నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలు, వారి అనుచరులు, ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేసిన నాయకులు బీఆర్ఎస్లో చేరటానికి సిద్ధంగా ఉన్నారని వివరించారు. ఇప్పటికే ఎన్సీపీ నాయకుడు, సంతోష్ మానే, కన్నాడ్ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ జాదవ్, బైజాపుర్ నుంచి ఎన్సీపీ మాజీ ఎమ్మెల్యే అభయ్ పాటిల్, ఔరంగాబాద్ నుంచి మైనార్టీ నాయకుడు ఫిరోజ్ ఖాన్, బీడ్ నుంచి శివసేన నాయకుడు దిలీప్ గోరే, బంగర్ నుంచి ఉస్తాద్ కామ్గార్ సంఘటన్ నాయకుడు బాలాసాహెబ్, రైతు నాయకుడు సుధీర్ బిందు, సంతోష్ గరేని శంబాజి, సూర్యవంశీ, జీయాజీరావు తదితరులు బీఆర్ఎస్లో చేరారని చెప్పారు.
ఛత్రపతి శంబాజీనగర్లోని జబిందా మైదానంలో లక్షన్నర మందితో భారీ బహిరంగ సభకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్టు బీఆర్ఎస్ నాయకుడు, ఎమ్మెల్యే జీవన్రెడ్డి తెలిపారు. 24న సాయంత్రం 5 గంటలకు సీఎం కేసీఆర్ సమక్షంలో 50 మంది కార్పొరేటర్లతోపాటు పలువురు ప్రముఖ నాయకులు పార్టీలో చేరబోతున్నట్టు చెప్పారు. ఎండల నేపథ్యంలో సభా ప్రాంగణంలో టెంట్లు ఏర్పాటు చేశామని, పురుషులు, మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించారు. వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేకంగా 10 ప్రాంతాలను ఎంపిక చేసినట్టు తెలిపారు. సభకు హాజరైన ప్రజలకు 200 మంది వలంటీర్లు 3 లక్షల మంచినీటి ప్యాకెట్లు, 3 లక్షల మజ్జిగ పాకెట్లను పంపిణీ చేస్తారని చెప్పారు.