న్యూఢిల్లీ: భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ ఇవాళ రాజ్యసభలో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ సవరణ బిల్లు 2022కు మద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు. కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ సర్కార్.. ఎస్టీలకు పది శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ అసెంబ్లీలో గతంలోనే తీర్మానం చేసినట్లు లింగయ్య యాదవ్ వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ హక్కుల్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో ఎస్సీల ప్రయోజనాల కోసం సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. దళిత బంధు పథకం కింద దళిత కుటుంబాలకు తమ ప్రభుత్వం పది లక్షల ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో 17 లక్షల దళిత కుటుంబాలకు ఆ పథకాన్ని అందజేయాలని తమ ప్రభుత్వం భావిస్తున్నట్లు చెప్పారు.
ప్రతి నియోజకవర్గంలో 600 కుటుంబాలకు దళిత బంధు పథకం అమలు అవుతోందన్నారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి మంచి నీటిని అందిస్తున్నట్లు చెప్పారు. ప్రతి తండాకు, దళితవాడకు నీళ్లు అందిస్తున్నట్లు వెల్లడించారు.ప్రతి ఎస్సీ, ఎస్టీలకు ఆసరా ఫించన్ల ఇస్తున్నట్లు చెప్పారు. ఆసరా ఫించన్ల ఎంతో ఉపయోగపడుతున్నట్లు తెలిపారు. తెలంగాణ సర్కార్ ప్రవేశపెట్టిన అన్నీ స్కీమ్లను కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల కోసం అమలు చేయాలని లింగయ్య యాదవ్ డిమాండ్ చేశారు.