KCR | రంగారెడ్డి : చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు.. బీసీల అభివృద్ధికి మలుపు అని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. బీసీల శక్తి, చైతన్యం ఏందో.. కాసాని జ్ఞానేశ్వర్ను గెలిపించి రుజువు చేయాలని కేసీఆర్ సూచించారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఎన్నో పరిశ్రమలు తెచ్చుకున్నాం. చేవెళ్లను పెద్ద పారిశ్రామిక కేంద్రంగా తయారు చేసే ప్రయత్నం చేశాం. షాబాద్లో వెల్స్పన్ ఫ్యాక్టరీ తెచ్చుకున్నాం. కైటెక్స్ పరిశ్రమ తెచ్చుకున్నాం. చందన్వెల్లిలో అమెజాన్, ఈస్టర్ కంపెనీలు ఏర్పాటు చేసుకున్నాం. సీతారాంపూర్లో ఎలక్ట్రానిక్ వెహికల్స్ కంపెనీ ఏర్పాటు చేసుకున్నాం. వికరాబాద్, చేవెళ్ల, తాండూరు, పరిగి నియోజకవర్గాలకు నీళ్లు తేవడానికి పాలమూరు ఎత్తిపోతల పెట్టుకున్నాం. ఉద్ధండపూర్ రిజర్వాయర్ మన కోసమే నిర్మించుకున్నాం. ఉద్ధండపూర్పై ఈ ప్రభుత్వం పాలసీ ఏంది..? అని కేసీఆర్ ప్రశ్నించారు.
అనేక ఏండ్లుగా బలహీన వర్గాల కోసం తన జీవితాన్ని, ఆస్తిని ధారబోసి ఆర్గనైజ్ చేసి సేవలందించిన బలహీన వర్గాల బిడ్డ జ్ఞానేశ్వర్ మీకు సుపరిచితులు. జడ్పీ చైర్మన్గా కూడా సేవలందించారు. నిన్న ఒకాయన మాట్లాడుతూ..బీసీలకు దమ్ముంటే, పౌరుషం ఉంటే జ్ఞానేశ్వర్ను గెలిపించి చూపించండి అన్నాడు. ఇవాళ అవకాశం ఉంది.. ఉన్నకాడ ఒక బీసీ అభ్యర్థి ఉన్నాడు, సమర్థడు, సీనియర్ నాయకుడు ఉన్నాడు. కాబట్టి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు.. బీసీల అభివృద్ధికి మలపు అని మనవి చేస్తున్నా. బీసీల శక్తి, చైతన్యం ఏందో కాసానిని గెలిపించి రుజువు చేయాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి మీకు ఇచ్చిన వాగ్దాలను అమలు చేయించాలన్నా, న్యాయం జరగాలన్నా, తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే పద్ధతులకు దారులు పడాలన్నా.. కచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిందే అని కేసీఆర్ స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. ధాన్యం వచ్చింది.. రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. మీరు తడిసిన ధాన్యం ఒక్క గింజ లేకుండా కొనాలి. రైతులకు న్యాయం చేయాలి. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే దాకా వెంటాడుతాం, వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని కేసీఆర్ తేల్చిచెప్పారు.