తన మనసెప్పుడూ తెలంగాణతోనే ఉన్నది.. గత 23 ఏండ్లుగా!తానెప్పుడూ తెలంగాణ ప్రజల్లోనే ఉన్నాడు.. ఉద్యమ నాయకుడిగా!పోరుబాటలో ఉన్నా, అధికారంలో ఉన్నా,ఎన్నికల్లో గెలిచినా, ఓడి పదవి దిగినా, వెంట ఎందరున్నా, ఎవ్వరూ లేకున్నా,అతనున్నది మాత్రం తెలంగాణతోనే! తెలంగాణ నమ్ముకున్నది ఆయననే!
తెలంగాణ రైతుల్లో తానొక రైతు! తెలంగాణ ఆడబిడ్డలకు అన్న! మోడువారిన బతుకు బాటలో ఉద్యమ దీప్తి వెలిగించినా…బీడువారిన పొలాల మీదికి నదీ జలాలను నడిపించినా…తెలంగాణ బతుకుకు అతనే ఒక ఆశ!తాను తెచ్చిన తెలంగాణ, తాను అభివృద్ధి చేసిన తెలంగాణ నాలుగు నెలలు గడవక ముందే ఆగమై పోవడం చూసి చలించిన కేసీఆర్ మరోసారి నడుంబిగించారు. ఎడారిలా మారిన పొలమే రణ సీమగా, ఎండిన వరిగడ్డి పోచలే పాశుపతాస్త్రంగా మార్చుకుని తెలంగాణ రైతాంగం కోసం సమర శంఖం పూరించారు. నీళ్లు లేని చేలను, రైతు కంట కన్నీళ్లను చూడలేక అ-రాజకీయాన్ని హెచ్చరిస్తూ రైతుకు సాయంగా కదిలారు!
మీరు లేరు.. అంతా ఆగమైపోతాంది సారూ..! నీళ్లు లేక నెల కిందటనే రెండెకరాలు ఎండినయ్. పంట పసులు మేసినయ్. ఇప్పుడు ఆరెకరాలు ఎండింది. లక్షా 82వేలు పెట్టి నాలుగు బోర్లేసినా లాభం లేకపాయె. పెట్టుబడికి తెచ్చిన రూ.3 లక్షల అప్పు మీద పడ్డది. నాలుగో తారీఖున కొడుకు రాజేందర్ పెండ్లి పెట్టుకున్నం. బిడ్డ పెండ్లప్పుడు అప్పు అయ్యింది. పంట పండితే సంబురంగా లగ్గం చేయాలనుకున్న. ఇప్పుడు చేతిలో చిల్లి గవ్వలేదు!కొడుకు పెండ్లికార్డును కేసీఆర్ చేతిలో పెట్టి వెక్కివెక్కి ఏడ్చింది అంగోత్ సత్తమ్మ. ఆమెకు ధైర్యం చెప్పిన కేసీఆర్.. 5 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. రందిలేకుండా పెండ్లి జరిపించాలని చెప్పారు.
KCR | హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): ఉద్యమ గొంతుక రైతు బాధై ధ్వనించింది. ప్రగతి సూచిక రాజకీయ పాచికలను ధిక్కరించింది. పనితీరు నిరూపించుకునేందుకు కొత్త ప్రభుత్వానికి 4 నెలల సమయమిచ్చి, మౌనంగా వేచి చూసిన బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రైతన్నకు బాసటగా రంగంలోకి దిగారు. కరువు కోరల్లో చిక్కుకున్న అన్నదాతకు ధైర్యం చెప్పేందుకు ముందుకు కదిలారు. అన్నీ సిద్ధంగా ఉన్నా అమలు చేయలేని చేతగాని, చేవలేని, అసమర్థ కాంగ్రెస్ సర్కారు వల్లే ఈ కరువు వచ్చిందని కదనభేరి మోగించారు. తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు చేసుకునే రోజు మళ్లీ వస్తుందని తాను ఎన్నడూ అనుకోలేదంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ కష్టం శాశ్వతం కాదని, రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని దండం పెట్టి నిండు మనసుతో వేడుకున్నారు. జనగామ, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో కేసీఆర్ ఆదివారం పర్యటించారు. బాధిత రైతులతో మాట్లాడారు. వాళ్ల కష్టాలను విన్నారు. కన్నీళ్లను తుడిచారు. కరువుకు కారణాలను వివరించారు.
తర్వాత సూర్యాపేటలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘గోదావరిలో డ్యాములున్నాయి. ఎత్తిపోసేందుకు మోటర్లున్నాయి. నిల్వ చేసేందుకు జలాశయాలున్నాయి. కరెంటు సరఫరాకు వ్యవస్థలున్నాయి. నింపుకొనేందుకు చెరువులున్నాయి. ఇంటింటికీ నల్లాలున్నాయి. కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యిలాంటి అనుకూలతలు చేసి అప్పగించాం. అయినా కాంగ్రెస్ సర్కారుకు నడిపించే తెలివి లేదు’అని కేసీఆర్ దుయ్యబట్టారు. బీఆర్ఎస్ పాలనలో ఎన్నడూ బిందెపట్టుకుని బయటకు రాని ఆడబిడ్డలు ఇప్పుడు మళ్లీ నీళ్ల కోసం తన్లాడుతుంటే తనకు కన్నీళ్లు వస్తున్నాయని ఆవేదన చెందారు. ఊర్లల్లో మళ్లీ జనరేటర్లు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, స్టెబిలైజర్లు వచ్చాయని, మోటర్లు కాలిపోతున్నాయని, పట్టుగొమ్మల్లాంటి పల్లెసీమల్లో బోరు బండ్ల హోరు వినిపిస్తున్నదని, హైదరాబాద్లో ట్యాంకర్ల బారులు కనిపిస్తున్నాయని కేసీఆర్ పరితాపం వ్యక్తంచేశారు. పదేండ్లుగా మాయమైనవన్నీ మళ్లీ ప్రత్యక్షమయ్యాయని ఇదీ కాంగ్రెస్ సర్కారు పనితీరు అని ధ్వజమెత్తారు. అద్భుతంగా ఉన్న కరెంటు వంద రోజుల్లోనే, కేసీఆర్ గల్మ దాటంగనే, కట్క బంజేసినట్టు ఏక్దమ్ ఎందుకు బందైందని ఆయన ప్రశ్నించారు. (కేసీఆర్ ఈ ప్రశ్న వేస్తున్న సమయంలోనే అక్కడ కరెంటు కట్ అయింది) ఈ ప్రభుత్వానికి రాజకీయాలు చేసేందుకు తీరిక ఉన్నదిగానీ, ప్రజల సమస్యలు చూసేందుకు వినేందుకు లేదని కేసీఆర్ విమర్శించారు. “రైతులంటే ఈ ప్రభుత్వానికి పట్టింపే లేదు. పంటలు ఎండుతున్నా ఎమ్మెల్యేలు రారు. ఎంపీలు ఊర్లకు పోరు. మంత్రులకు తీరిక లేదు.
ఇక ముఖ్యమంత్రికి ఢిల్లీ యాత్రలే సరిపోతాయి. ఇదీ కాంగ్రెసోళ్ల వ్యవహారం” అని కేసీఆర్ ఘాటుగా వ్యాఖ్యానించారు. “వంద రోజుల్లో 200 మంది రైతులు చనిపోతే పాలకులు ఏం చేస్తున్నరు? గుడ్డి గుర్రాల పండ్లు తోముతున్నరా?” అని ఆయన సూటిగా ప్రశ్నించారు. డిసెంబర్ 9నే రుణమాఫీ చేస్తమని, ఎకరాకు 15 వేల రైతుబంధు వేస్తమని, అన్ని పంటలకు 500 బోనస్ ఇస్తమని గ్యారెంటీలు ప్రకటించిన వాళ్లు ఇప్పుడు ఎక్కడ పోయారని కేసీఆర్ అడిగారు. “డిసెంబర్ 9 పోయి ఎన్ని రోజులైంది. వేర్ ఆర్ యూ స్లీపింగ్ మిస్టర్ చీఫ్మినిస్టర్. ముఖ్యమంత్రీ.. నువ్వెక్కడ నిద్ర పోతున్నవ్?”అని కేసీఆర్ గొంతెత్తారు. “అవసరమైతే అప్పులు చేయాల్సిందే. రైతులకు కరెంటు ఇవ్వాల్సిందే. రైతులను ఎండబెట్టి విద్యుత్తు ఆదా చేస్తరా? రైతుల కోసం కాకపోతే ఎవరి కోసం అప్పులు చేస్తరు?”అని నిలదీశారు.“మా ప్రభుత్వంలో రైతాంగాన్ని కంటికి రెప్పలా కాపాడుకున్నం. పదేండ్లలో ఎకరా ఎండని తెలంగాణలో ఇప్పుడు 14 లక్షల ఎకరాలు ఎండబెట్టారు.
100 రోజుల్లోనే 200 మంది రైతుల బలి
ఆనాడు కరెంటు పోతే వార్త. ఇయ్యాల కరెంటు ఉంటే వార్త. ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? ప్రజలందరికీ 24/7 కరెంటును అద్భుతంగా సప్లయ్ చేసిన రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటే. అలాంటి రాష్ర్టానికి ఏం చెదలు పట్టింది? 100 రోజుల్లోనే ఇంత అస్తవ్యస్తం ఏంది? 200 మంది రైతులు చనిపోవుడేంది? ఇందులో ఉన్న తమాషా ఏంది?
కొత్తగా నడిపించేది ఏం లేదు. మొద్దులు మోసేది లేదు. కట్టెలు కొట్టేది లేదు. కొత్తగా గడ్డపారలు పట్టి తవ్వేదిలేదు. ఉన్నది ఉన్నట్టు నడిపించలేని అసమర్థత ఏంది? అశక్తత ఏంది? కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యి కదా. దానిని నడిపించే తెలివిలేకపోతే ఎట్లా?
దీన్నిబట్టి మనకు స్పష్టంగా అర్థమైతున్నది ఏందంటే.. ఇప్పుడు రాష్ర్టాన్ని పరిపాలిస్తున్న పార్టీ, ప్రభుత్వానిది అసమర్థత, అవివేకం, తెలివితక్కువతనం, అవగాహన రాహిత్యం, దేన్ని ఎట్లా వాడాల్నో తెలియని అర్భకత్వం.బీఆర్ఎస్ పాలనలో ఎన్నడూ బిందెపట్టుకుని బయటకు రాని ఆడబిడ్డలు ఇప్పుడు మళ్లీ నీళ్లకోసం తండ్లాడుతున్నారు. ఊర్లల్ల మళ్లీ జనరేటర్లు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, స్టెబిలైజర్లు వచ్చినయ్. మోటర్లు కాలిపోతున్నాయ్. పట్టుగొమ్మల్లాంటి పల్లెసీమల్లో బోరుబండ్ల హోరు వినిపిస్తున్నది. హైదరాబాద్లో ట్యాంకర్లు బారులు తీరుతున్నయ్. పదేండ్లుగా మాయమైనవన్నీ మళ్లీ ప్రత్యక్షమైనయ్. ఇదీ కాంగ్రెస్ నిర్వాకం.రైతులంటే ఈ ప్రభుత్వానికి పట్టింపే లేదు. పంటలు ఎండుతున్నా ఎమ్మెల్యేలు రారు. మంత్రులకు తీరిక లేదు. ఇక ముఖ్యమంత్రికి ఢిల్లీ యాత్రలే సరిపోతున్నయ్. ఇదీ కాంగ్రెసోళ్ల వ్యవహారం.
ఖమ్మం జిల్లాలోని పాలేరు రిజర్వాయర్తోపాటు నేలకొండపల్లి మండలంలో ఎండిపోయిన పంటలను బీఆర్ఎస్ నేతలు పరిశీలించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు తాతా మధు ఆధ్వర్యంలో ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, మదన్లాల్, చంద్రావతి పంటలను పరిశీలించి రైతులకు భరోసా కల్పించారు.
నీళ్ల కోసం రోడ్డెక్కిన రైతాంగం
కరీంనగర్ జిల్లా కొండన్నపల్లి వరదకాలువ వద్ద జగిత్యాల-కరీంనగర్ హైవేపై ఆదివారం రైతులు ధర్నాకు దిగారు. వీరికి చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ నేతృత్వంలో బీఆర్ఎస్ నాయకులు సంఘీభావం ప్రకటించారు. వరద కాలువకు నీరు ఇచ్చి పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. దిగివచ్చిన సర్కారు సాయంత్రం గాయత్రీ పంప్హౌస్ నుంచి వరద కాలువకు నీటిని వదిలింది.
ఎస్సారెస్పీ కాల్వకు నీళ్లివ్వాలని రాస్తారోకో
ఎస్సారెస్పీ కాల్వకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ గ్రామ శివారులోని కరీంనగర్-రాయపట్నం రహదారిపై రైతులు ఆదివారం రాస్తారోకో చేశారు. ట్రాఫిక్ స్తంభించడంతో పోలీసులు నీటి పారుదల శాఖ అధికారులతో ఫోన్లో మాట్లాడించారు. ఏప్రిల్ 2 వరకు కాల్వకు నీటిని విడుదల చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.
మండుటెండలో పొలంలో నిరసన
కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం వల్లే సాగునీటికి కటకట ఏర్పడి పంటలు ఎండిపోయే పరిస్థితి దాపురించిందని జగిత్యాల జడ్పీ చైర్పర్సన్ దావ వసంత మండిపడ్డారు. ఆదివారం జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం భూషణరావుపేట శివారులో సాగునీరందక ఎండిపోయిన వరి పొలాలను ఆమె పరిశీలించి రైతులను ఓదార్చారు. కథలాపూర్ శివారులో ఎస్సారెస్పీ వరదకాలువలో అడుగంటిన నీటిని పరిశీలించారు.