KCR | కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్లకు తోక తెల్వదు.. తొండం తెల్వదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించారు. ప్రాజెక్టు గురించి వాళ్లకు వెంట్రుక కూడా తెలియదన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండిపోయిన పంటలను పరిశీలించిన అనంతరం.. సిరిసిల్లలో కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు స్వరూపం గురించి వివరించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో మూడు బరాజ్లు ఉన్నాయి. వాటిని ఇసుకలనే కడతాం. వాటికి కూడా పిల్లర్లు ఉంటాయి. మెయిన్ గోదావరి మీద.. ఉప నదుల మీద అన్ని బరాజ్ల మీద కలిపి 300 చిల్లర పిల్లర్లు ఉంటాయి. మూడు బరాజ్లు కలిపి దాదాపు 200 చిల్లర గేట్లు ఉంటాయి. దాని తర్వాత ఒక్కో పంప్ హౌజ్ ఉంటాయి ‘ అని కేసీఆర్ చెప్పారు. మొన్న వెళ్లి నంది మేడారం, వరద కాల్వల నీళ్లు పోయడానికి వీళ్లు పంపులు స్టార్ట్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కాళేశ్వరం అయ్యేపోయిందని అన్నోళ్లు.. ఆ పంప్ ఎందుకు ఒత్తారని ప్రశ్నించారు. పంపులు స్టార్ట్ చేస్తే నీళ్లు ఎట్ల వచ్చాయని నిలదీశారు. కాళేశ్వరం లేనిదే ఆ నీళ్లు వచ్చాయా? అని ప్రశ్నించారు. మీలా లత్కోర్ పనులు చేయలేదని ఎద్దేవా చేశారు.
తెలంగాణ కాంగ్రెస్ నాయకుల అసమర్థత వల్ల రెండు బ్యారేజిలను సమైక్య పాలకులు దశాబ్దాల తరబడి పెండింగ్లో పెట్టారని కేసీఆర్ గుర్తు చేశారు. మిడ్ మానేరు, ఎల్లంపల్లి ప్రాజెక్టులను అసంపూర్తిగా పెట్టారని అన్నారు. ఆనాడు వాటిని ఆగమేఘాల మీద కంప్లీట్ చేస్తుంటే.. ఒక్క సీజన్లో మాచారెడ్డి మండలంలో 25 సెం.మీ. వర్షం కురిసి.. మానేరు వాగులో పెద్ద వరద వచ్చి మిడ్ మానేరు ప్రాజెక్టు కొట్టుకుపోయిందని తెలిపారు. నేడు అడ్డం పొడుగు మాట్లాడుతున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ ప్రాజెక్టు కట్టారని బయటపెట్టారు. వాళ్ల అమ్మ పేరు మీద ఉన్న కంపెనీనే దాన్ని కట్టిందని తెలిపారు. ‘ఆగమేఘాల మీద కాళేశ్వరం ప్రాజెక్టు కంప్లీట్ కావాలి. రైతులకు నీళ్లు రావాలి. ఎంత తొందరగా వస్తే అంత మంచిది. సాగునీటి బాధ పోవాలి.. తాగు నీటి బాధ పోవాలి అని ఆరాటపడ్డాం తప్ప కోమటిరెడ్డి కంపెనీ మీద కేసులు పెట్టలేదు’ అని తెలిపారు. మీ లెక్క చిల్లర కథలు పడాలంటే కేసులు పెట్టి.. వాళ్లను జైలుకు పంపకపోదుమా అని ప్రశ్నించారు. ఆనాడు ప్రభుత్వం తమ చేతుల్లో ఉన్నప్పటికీ అలాంటి చిల్లర పనులు చేయలేదని స్పష్టం చేశారు. ఆ దరిద్రుడు పోతే పోనీ అని వదిలేసి ప్రాజెక్టు కట్టినం. నింపి నిలబెట్టినం. నిండ నింపి గంగమ్మలా తయారు చేసినం. ఆ బ్రిడ్జి మీద పోతుంటే రెండు వైపులా చూసి భయమయ్యే పరిస్థతి తెచ్చినం. అంత అద్భుతంగా.. సముద్రంలా నీళ్లు కనబడేవి. దాన్ని ఇవాళ మీ తెలివితక్కువ, అసమర్థతో ఏడారి చేశారని మండిపడ్డారు.
‘ గోదావరిలో వచ్చే వరద మామూలుగా ఉండదు.. పైనుంచి నీళ్లు తక్కువ.. కింద నీళ్లు తక్కువ. గోదావరిలో నీళ్లు దొరికేదే ప్రాణహిత. ప్రాజెక్టు కడితే ప్రాణహిత దాటిన తర్వాతే కట్టాలి. దానికోసం ఆరు నెలలు తపస్సు చేసినట్టు చేసి మేడిగడ్డను కనిపెట్టుకున్నాం. కేంద్ర ప్రభుత్వ సంస్థతో కలిసి లైడర్ సర్వే కూడా చేశామని కేసీఆర్ తెలిపారు. అసలు మేడిగడ్డ డిజైన్ గురించి ఐడియా ఉందా? అని ప్రశ్నించారు. మేడిగడ్డ బ్యారేజిలో గోదావరి పొంగే మూడు, మూడున్నర నెలలు గేట్లు అన్ని ఎత్తే ఉంటాయి. నీళ్లు ఫ్రీ ఫ్లో ఉంటాయి. మనకు అవసరమైన నీటిని ఎత్తుకుంటాం. అందుకే కన్నెపల్లి దగ్గర లక్ష్మీ బరాజ్ను కట్టాం. మేడిగడ్డ బరాజ్ అవసరం లేకుండానే నీళ్లు ఎత్తుకునే అవకాశం అక్కడ ఉంటది. ఆ పాయింట్ పట్టుకున్నదే అందుకు. అక్కడి నుంచి నంది మేడారం.. నందిమేడారం నుంచి గాయత్రి పంప్హౌజ్.. గాయత్రి నుంచి వరద కాల్వ ద్వారా మిడ్ మానేరుకు.. మిడ్ మానేరు నుంచి ఎల్ఎండీ, మిడ్ మానేరు ద్వారా మల్లన్న సాగర్కు, మిడ్ మానేరు ద్వారా ఎస్సారెస్పీకి ఎటు అవసరం ఉంటే అటు వాడుకునేలా మిడ్ మానేరును ఓ ఖజానా చేసినం.’ అని కేసీఆర్ అన్నారు.
‘ గోదావరి నీళ్లను ఎత్తేందుకు మేడిగడ్డ బరాజ్ అవసరమే లేదు. టాక్టికల్ అప్రోచ్కు అవసరం. మేడిగడ్డ బరాజ్ ఎప్పుడు అవసరం పడతదాంటే.. జూన్ చివరినాటికి 20, 25 వేల క్యూసెక్కుల ప్రవాహం స్టార్ట్ అవుతుంది. అప్పుడు గేట్లు అన్ని గేట్లు ఎత్తేస్తాం. సెప్టెంబర్లో మళ్లీ ప్రవాహం 25వేల క్యూసెక్కులకు డౌన్ అవ్వగానే దించేస్తారు. అది కూడా అటు వైపు రెండు, ఇటు వైపు రెండు గేట్లను వదిలేసి మిగిలినవి క్లోజ్ చేస్తాం. అలా వచ్చిన నీళ్లు వచ్చినట్టు బయటకు పోయేటట్టు చేస్తాం. 9, 10 టీఎంసీలు నిల్వ ఉండేటట్టు కాపాడుతాం. వాటినే ఎత్తిపోస్తుంటాం.. ఎప్పటికప్పుడు ఎత్తిపోస్తుంటాం కాబట్టి చెరువులు, చెక్డ్యాంలు, కుంటలు నిండి ఉంటుండె. భూగర్భ జలం రీచార్జ్ అవుతుండె. ఏ బాధ లేకుండే.. పంటలు ఎండకుండే.. అందువల్లే మే నెలలో కూడా మత్తళ్లు దుంకినయ్.. తెలివిగా ఏ టైమ్లో ఎత్తిపోయాలో ఆ టైమ్లో ఇంజనీర్లతో ఎత్తిపోసినం. ‘ అని కేసీఆర్ చెప్పారు.
ఇదే పద్ధతిపై ఆ సన్నాసులకు తెలివి లేకపోతే మీ తెలివికి ఏమైందని నిన్న, మొన్న ఇంజనీర్లతో మాట్లాడిన. కానీ పై నుంచి తమను నిరోధించిండ్రు అని చెప్పారు. బరాజ్లోని నీళ్లను కూడా కావాలనే వదిలేశారని చెప్పారు. వీళ్ల తెలివితక్కువ తనానికి ఏం చేస్తామని ఇంజీనర్లే చెప్పారని అన్నారు. కావాలనే 48 టీఎంసీల నీటిని సముద్రానికి వదిలేశారని ఇంజనీర్లు చెప్పారని తెలిపారు. బరాజ్ కుంగిందని కేసీఆర్ను, గత ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చిల్లర కుట్రతో ప్రేక్షకుల్లా చూసుకుంటూ ఉంటే నీళ్లన్ని పోయాయని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు కూడా ప్రాణహిత ద్వారా 1500 క్యూసెక్కుల నీరు పోతుందని చెప్పారు.
అసలు ఏ ప్రాజెక్టు దగ్గర ఎన్ని పంపులు ఉన్నాయో లెక్క అయినా తెలుసా అని కాంగ్రెస్ నాయకులను కేసీఆర్ ప్రశ్నించారు. 2200 క్యూసెక్కుల సామర్థ్యం ఉండే 17 పంపులు కన్నెపల్లిలో ఉన్నాయని.. నీళ్ల అవసరాన్ని బట్టి పంపులను నడిపేవాళ్లమని చెప్పారు. కానీ దాన్ని నడపకుండా.. కుట్ర చేశారన్నారు. అసలు అందులో ఏముందని ప్రశ్నించారు. మొన్న కేంద్రం నుంచి వచ్చినోళ్లు కూడా ఆ రెండు పిల్లర్ల కింద ఇసుక కదిలిందని చెప్పిండ్రని అన్నారు. ఇలా చాలా బరాజ్లపై జరుగుతుంటాయని కేసీఆర్ తెలిపారు. గంగా నదిపై బ్రిడ్జి కడుతుంటే ఇలాగే కూలిపోయిందని మొన్న వార్తల్లో వచ్చిందన్నారు. నదుల్లో ఇసుక కారణంగా ఇలాంటివి జరుగుతుంటాయని చెప్పారు.
ఎవరో ఇంజనీర్లోపమో.. మెయింటెనెన్స్ లోపమో జరిగితే.. దానికి ఏదో ప్రళయం బద్ధలైనట్లుగా ఒకటే పని కట్టుకుని యాత్రలు పెట్టి.. కథలు చేసిండ్రు అని కేసీఆర్ మండిపడ్డారు. ఇప్పుడు కూడా ఆదే ఆలోచనతో ఉన్నారని సీరియస్ అయ్యారు. అక్కడ వెంట్రుక దొరుకుతదేమో.. తోక దొరుకుతదేమో.. గుట్టకు కడతామని పిచ్చి విఫల ప్రయత్నంలో ఉన్నారు తప్ప.. రైతాంగాన్ని ఆదుకోవాలే.. మంచినీళ్లను కాపాడుకోవాలనే ఆలోచన చేయలేదని విమర్శించారు. ఒక చిల్లర కుట్ర మనసులో పెట్టుకుని వదిలిపెట్టారు కాబట్టి నీళ్లన్ని పోయాయని అన్నారు. ఈ దద్దమ్మలకు చాతగాకపోతే 50 వేల మంది రైతులతో వీళ్లను తొక్కుకుంటూ పోయి.. మేడిగడ్డ దగ్గర కుర్చీ వేసుకుని కూర్చొని అన్నింటిని నింపుతానని అన్నారు. దీన్ని కచ్చితంగా చేసి చూపిస్తానని అన్నారు.
గోదావరిలో ప్రవాహం మొదలయ్యాక బరాజ్తో సంబంధం లేకుండానే నీళ్లు లేపొచ్చు. మళ్లీ మిడ్మానేరు, లోయర్ మానేరు డ్యామ్ కళకళలాడుతాయి. అవసరమైతే ఎస్సారెస్పీకి ఇవ్వొచ్చని కేసీఆర్ అన్నారు. ఈ ప్రభుత్వం కాళేశ్వరం నుంచి నీళ్లను ఎత్తాలని డిమాండ్ చేశారు. మేడిగడ్డ పేరు చెప్పి ప్రజల నోట్లో మట్టికొడతామంటే చూస్తూ కూర్చోమని హెచ్చరించారు. ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పడి కొత్త కాబట్టి మౌనం పట్టాం.. కానీ ఇప్పుడు చూస్తూ ఉండమని హెచ్చరించారు. గోదావరిలో 20 వేల క్యూసెక్కులు దాటిన తర్వాత వీళ్లు నీళ్లు ఎత్తడం ప్రారంభించకపోతే తానే పోతానని అన్నారు. 50వేల మంది రైతులను వేసుకుని వెళ్లి.. వీళ్లను పండబెట్టి తొక్కి ఆ మోటార్లను నడిపిస్తామని అన్నారు. ఊరికే చేతులు ముడుసుకుని కూర్చోలేదన్నారు. ఇన్ని అవకాశాలు ఉండగా.. వీటిని పక్కనబెట్టి కాకరకాయ తోకరకాయ మాటలు చెప్పి.. ఇదా రాజ్యం నడిపే పరిస్థితి అని ధ్వజమెత్తారు.