హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): భారతీయ సినీ దర్శక దిగ్గజం, దాదాసాహెబ్ ఫాలే అవార్డు గ్రహీత, పద్మభూషణ్ శ్యామ్బెనగల్ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సంతాపం ప్రకటించారు. విస్మరించబడిన మనుషుల సామాజిక నేపథ్యాలకు సినిమా రంగంలో సమాంతర స్థానం కల్పించి, సామాన్యుల జీవన ఇతివృత్తాలను ఎంచుకొని వెండితెరకే వెలుగులద్దేలా గౌరవం కల్పించిన గొప్ప దర్శకుడు, భరతమాత కన్న తెలంగాణ ముద్దుబిడ్డ శ్యామ్బెనగల్ అని కేసీఆర్ కొనియాడారు. ఇటు తెలంగాణ జీవన నేపథ్యాన్ని, అటు దేశీయ సామాజిక, సాంస్కృతిక వైవిధ్యాన్ని ఇరుసుగా చేసుకుని, ఆలోచింప చేసేవిధంగా దృశ్యమానం చేస్తూ, డాక్యుమెంటరీలు, సినిమాల రూపంలో ఆయన సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు. హైదరాబాద్ గడ్డ మీద పుట్టిన బిడ్డగా చలనచిత్ర రంగంలో తన కృషితో ప్రతిష్ఠాత్మక అవార్డులు సాధించి, భారతీయ సినిమాకు వన్నెతెచ్చిన శ్యామ్బెనెగల్ తెలంగాణకు గర్వకారణం అని పేర్కొన్నారు.