హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 22 (నమస్తే తెలంగాణ): ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కుంభం మధుసూదన్రెడ్డి (90) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన మంగళవారం ఉదయం 11 గంటలకు నారాయణగూడలోని తన నివాసంలో చివరిశ్వాస విడిచారని కుటుంబసభ్యులు తెలిపారు. ఆయనకు భార్య విమల, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మధుసూదన్రెడ్డి మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్తోపాటు పలువురు ప్రముఖులు తీవ్ర సంతాపం తెలిపారు. ఆయన మరణవార్త తెలిసిన వెంటనే ఓయూ మాజీ వైస్చాన్స్లర్ ప్రొఫెసర్ సులేమాన్ సిద్ధిఖి, ప్రముఖ సామాజికవేత్త ప్రొఫెసర్ కంచె ఐలయ్య, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, రామానందతీర్థ గ్రామీణ విద్యాసంస్థ చైర్మన్ నారా కిశోర్రెడ్డి, మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ, హైకోర్టు మాజీ అడ్వకేట్ జనరల్ ప్రకాశ్రెడ్డి, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తదితరులు ఆయన నివాసానికి వెళ్లి భౌతికకాయం వద్ద నివాళులర్పించారు. మధుసూధన్రెడ్డి అంత్యక్రియలు బుధవారం ఉదయం 11 గంటలకు ఫిల్మ్నగర్లోని మహాప్రస్థానంలో నిర్వహించనున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు.
నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండలం, శివన్నగూడానికి చెందిన శివారెడ్డి, రంగనాయకమ్మకు 1935లో మధుసూదన్రెడ్డి జన్మించారు. ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం శివన్నగూడెంలో, ఇంటర్మీడియట్ హైదరాబాద్ వీవీ కళాశాలలో, డిగ్రీ నిజాం కళాశాలలో పూర్తిచేశారు. ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్గా గొప్ప పాలనాధ్యక్షుడుగా పనితీరు కనబరిచారు. ఓయూ సోషల్ సైన్సెస్ డీన్గా వ్యవహరించారు. రాజనీతి శాస్త్రంలో గొప్ప బోధకుడిగా పేరొందిన ఆయన వివిధ దేశాల్లో నిర్వహించిన సెమినార్లలో పాల్గొన్నారు. తెలంగాణ స్వరాష్ట్ర సాధనలో క్రియాశీలక పాత్ర పోషించారు. ఉద్యమకారులనుంచి రాజకీయ నేతలవరకు అందరితో కలిసి పనిచేసిన ఘనత ఆయనది.
తెలంగాణ ఉద్యమ భావజాలం వ్యాప్తికి ప్రొఫెసర్ మధుసూదన్రెడ్డి ఎంతో కృషి చేశారని, ఆయన సేవలు మరువలేనివని బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కొనియాడారు. ఆయన మరణం తెలంగాణకు తీరని లోటు అని పేర్కొంటూ తన ప్రగాఢ సంతాపం తెలిపారు. ప్రొఫెసర్ మధుసూదన్రెడ్డి నిఖాైర్సెన తెలంగాణ వాది అని రిటైర్డ్ జస్టిస్ సుదర్శన్రెడ్డితోపాటు పలువురు ప్రొఫెసర్లు, న్యాయవాదులు, సామాజిక వేత్తలు కొనియాడారు. ప్రొఫెసర్ మృతి పట్ల మాజీ వీసీ ప్రొఫెసర్ వీరారెడ్డి, మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచందర్రావు, తెలంగాణ ఇన్ఫర్మేషన్ సెంటర్ వ్యవస్థాపకుడు తెలంగాణ ప్రభాకర్, ఉన్నత విద్యామండలి వైస్చైర్మన్ ప్రొఫెసర్ పురోషోత్తంరెడ్డి, ప్రొఫెసర్ హరగోపాల్ తదితరులు సంతాపం తెలిపారు. పలు ప్రైవేటు విద్యా సంస్థల యజమానులు కృష్ణారావు, వేణుగోపాల్రెడ్డి.. తదితరులు కూడా సంతాపాలు ప్రకటించారు.
ప్రొఫెసర్ మధుసూదన్రెడ్డి మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో.. ఒక ప్రొఫెసర్గా, మేధావిగా, భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ, ఉద్యమ పాఠాలు బోధిస్తూ.. క్రియాశీలకంగా కృషి చేశారని కేసీఆర్ తెలిపారు. ప్రొఫెసర్ మధుసూదన్రెడ్డితో తనకున్న ఉద్యమ బంధాన్ని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. తెలంగాణ సామాజిక, రాజకీయ నిర్మాణం పట్ల లోతైన అవగాహనతో, పూర్తి సాధికారత కలిగిన తెలంగాణ తొలితరం మేధావిగా, బహుజన పక్షపాతిగా మధుసూదన్రెడ్డి ఆలోచనధార చాలా గొప్పదని కేసీఆర్ పేర్కొన్నారు. వారి మరణం తెలంగాణకు తీరని లోటు అని తెలుపుతూ.. శోకతప్తులైన వారి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.