హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా బీఆర్ఎస్ పార్టీ నేతలు నవీన్కుమార్, దేశపతి శ్రీనివాస్, చల్లా వెంకట్రాంరెడ్డి గురువారం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ముందుగా గన్పార్క్లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం మంత్రులు హరీశ్రావు, జగదీశ్రెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్తో కలిసి దేశపతి శ్రీనివాస్ తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యే అబ్రహాంతో కలిసి చల్లా వెంకట్రాంరెడ్డి, అలాగే మంత్రులు సబితాఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, మహమూద్ అలీ, ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్తో కలిసి నవీన్కుమార్ తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు.
కోలాహలంగా అసెంబ్లీ ప్రాంగణం
ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణం కోలాహలంగా మారింది. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, పువ్వాడ అజయ్, అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ప్రభుత్వ విప్లు ఎంఎస్ ప్రభాకర్రావు, శంభీపూర్ రాజు, గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీ వాణీదేవి సహా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థుల కుటుంబ సభ్యులతో అసెంబ్లీ ప్రాంగణం కిటకిటలాడింది.