Huzurnagar | కాంగ్రెస్ కంచుకోటల్లో ఒకటి హుజూర్నగర్. గెలిపించిన ప్రజలను గాలికి వదిలేయడంలో ఆ పార్టీ ప్రదర్శించే వైఖరినే ఉత్తమ్ అమలు చేశారు. 2009, 2014, 2018 వరుసగా మూడు ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ సాధించిన ఆయన.. 2019లో ఎంపీగా గెలిచి హస్తిన బాటపట్టారు. ఆపై జరిగిన ఉప ఎన్నికలో హుజూర్నగర్లో గులాబీ జెండా రెపరెపలాడింది. ఎంపీగా గెలిచిన ఉత్తమ్ రాజీనామాతో 2019లో ఉపఎన్నిక జరిగింది. ఆ పోరులో ఉత్తమ్ సతీమణి పద్మావతిపై బీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి 43వేల పైచిలుకు మెజారిటీతో విక్టరీ సాధించారు. గులాబీ పార్టీ గెలుపుతో హుజూర్నగర్ పురోగతి మొదలైంది.
ఉమ్మడి రాష్ట్రంలో హుజూర్నగర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలూ పారిశుద్ధ్యం సమస్యతో సతమతమయ్యేవి. అభివృద్ధిలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందాన ఉండేది. ఎన్నికల వేళ ప్రజలకు భారీగా హామీలిచ్చే ఉత్తమ్.. వాటిని అమలు చేయడంలో మాత్రం అంతే ఉత్సాహం కనబర్చేవారుకారని స్థానికుల మాట. పార్టీలో సీనియర్ నేతగా, మంత్రిగా పనిచేసిన అనుభవం నియోజకవర్గ పురోగతికి పనికిరాలేదని కాంగ్రెస్ మద్దతుదారులు సైతం విమర్శించేవారు. తన పలుకుబడితో ప్రజా సంక్షేమాన్ని పట్టాలెక్కిస్తే తమ ప్రాంతం రూపురేఖలు మారిపోయేవి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కేవలం ఏడువేల మెజారిటీతో గట్టెక్కడం, 2019 ఉప ఎన్నికలో పద్మావతి భారీ తేడాతో ఓడిపోవడమే ఉత్తమ్ పనితీరుకు నిదర్శనం. ఆయన చేపట్టిన అభివృద్ధి ఏపాటిదో దారులు లేని ఊళ్లే చెబుతాయి. నాలుగు సబ్స్టేషన్లు, రెండు పునరావాస కేంద్రాలు, డిగ్రీ కళాశాల మంజూరు ఇవ్వే విజయాలుగా కనిపిస్తాయి. ఓ దవాఖాన, షాదీఖాన తనను మూడుసార్లు గెలిపించిన ప్రజలకు ఇచ్చిన ఆత్మీయ కానుకలు.
తెలంగాణ వచ్చిన నాటి నుంచి నిజమైన సంక్షేమ ఫలాలు హుజూర్నగర్ ప్రజలకు చేరువయ్యాయి. ఉప ఎన్నిక సందర్భంగా నియోజకవర్గానికి సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు పూర్తయి హుజూర్నగర్ నసీబు మారింది. గడప గడపనూ సంక్షేమ పథకాలు పలకరిస్తున్నాయి. హుజూర్నగర్ మున్సిపాలిటీకి రూ.60 కోట్లు, నేరేడుచర్ల మున్సిపాలిటీకి రూ.50కోట్లు, ప్రతి గ్రామ పంచాయతీకి రూ.20 లక్షలు, ఒక్కో మండలానికి రూ.30 లక్షలు నిధులు అందివ్వడంతో ప్రతి గ్రామానికి, పట్టణాకి కొత్తరూపు వచ్చింది. మిర్యాలగూడ- కోదాడ ప్రధాన రహదారి విస్తరణలో భాగంగా నేరేడుచర్ల, హుజూర్నగర్లో రోడ్డు వెడల్పు, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటైంది. హుజూర్నగర్ రెవెన్యూ డివిజన్ కావడంతో ఆర్డీవో కార్యాలయం వచ్చింది. ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటుతో కార్మికులకు మెరుగైన వైద్యం చేరువైంది. నూతనంగా నిర్మించిన బంజారాభవన్ గిరిజన బిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచింది.
రూ.1,639 కోట్లతో లిఫ్ట్లు ఏర్పాటు చేయడంతో నియోజవర్గంలో సాగునీటి స్థిరీకరణ జరిగింది. రూ.27కోట్లతో చెక్డ్యాంలు నిర్మించడంతో భూగర్భ జలాల మట్టం పెరిగింది. రూ.58.82 కోట్లతో మిషన్ కాకతీయ కింద 126 చెరువులు పునరుద్ధరించారు. రూ.5.66 కోట్లతో నూతన వంతెనలు నిర్మించారు. మన ఊరు- మన బడి కింద ఎన్నో పాఠశాలలు కొత్త హంగులు సంతరించుకున్నాయి. అవసరార్థులకు రూ.10.77 కోట్లు సీఎం సహాయ నిధి అందింది. దళితబంధు, రైతుబంధు పథకాలు జనజీవనాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దాయి. గురుకులాలు, కొత్త పాఠశాలలతో విద్యా వ్యవస్థ బాగుపడింది. ఘనంగా ప్రకటించిన హామీలను నెరవేర్చలేక తమను గాలికొదిలేసిన ఉత్తమ్కు మరోసారి ఓటమి తప్పదనీ, ఇచ్చినమాటకు కట్టుబడి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నిలిపిన సైదిరెడ్డి విజయం తథ్యమనీ చెబుతున్నారు హుజూర్నగర్ ఓటర్లు.