BRS Sabha | (నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి) ఔరంగాబాద్, ఏప్రిల్ 21/జహీరాబాద్: మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో ఈ నెల 24న నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు కనీసం లక్షన్నర మందిని సమీకరించాలన్న లక్ష్యంతో బీఆర్ఎస్ నాయకులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ మహారాష్ట్రలో నిర్వహించనున్న 3వ బహిరంగ సభ ఇది. నాందేడ్, కాందార్-లోహా సభలకు విశేష స్పందన లభించడంతో బీఆర్ఎస్ నాయకులు మరింత ఉత్సాహంతో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్లో 132 అడుగుల ఎత్తయిన అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రకాశ్అంబేద్కర్ను ముఖ్యఅతిథిగా ఆహ్వానించడాన్ని మహారాష్ట్ర ప్రజలు విస్తృతంగా చర్చించుకుంటున్నారు.
ఇప్పటికే ఔరంగాబాద్ జిల్లాలోని 7 నియోజకవర్గాలకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరడం కార్యకర్తల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది. ఔరంగాబాద్ సభలో సీఎం కేసీఆర్ సమక్షంలో 50 మంది కార్పొరేటర్లు గులాబీ కండువా కప్పుకోనున్నట్టు ఔరంగాబాద్ సభ ఏర్పాట్ల ఇన్చార్జి, ఎమ్మెల్యే జీవన్రెడ్డి తెలిపారు. భారీసభ రోజు 200 మంది వాలంటీర్లు పనిచేస్తారని, 3 లక్షల మంచినీటి ప్యాకెట్లు, 3 లక్షల మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేస్తామని చెప్పారు. వైజాపూర్, కన్నాడ్, గంగాపూర్, ఔరంగాపూర్ తదితర గ్రామాల్లో మంచి స్పందన లభిస్తున్నదని వివరించారు. ఔరంగాబాద్లో బీఆర్ఎస్ నిర్వహించనున్న బహిరంగ సభ ఏర్పాట్లను శుక్రవారం ఆయన జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, బీఆర్ఎస్ కిసాన్ సమితి మహారాష్ట్ర అధ్యక్షుడు మాణిక్ కదం, మాజీ ఎమ్మెల్యే శంకరన్న దోండ్గే, ఔరంగాబాద్ పోలీసు కమిషనర్ గుప్తాతో కలిసి పరిశీలించారు.