హైదరాబాద్: పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్, బీఎస్పీ (BRS-BSP) కలిసి పోటీచేయనున్నాయి. ఇరు పార్టీల మధ్య పొత్తు ఖరారయింది. ఇందులో భాగంగా బీఎస్పీకి రెండు పార్లమెంటు స్థానాలు కేటాయించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. నాగర్కర్నూల్, హైదరాబాద్ ఎంపీ స్థానాలను బీఎస్పీకి కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. మిగిలిన స్థానాల్లో బీఆర్ఎస్ పోటీచేయనుంది. ఇప్పటికే 11 ఎంపీ స్థానాలకు తమ అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు.
కాగా, రాబోయే లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీచేయాలని రెండు పార్టీలు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నెల 5న బీఆర్ఎస్ అధినేతతో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు దేశంలో సెక్యులర్ విలువలు క్షీణించడం, దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ బలహీన పడటం, దళిత, నిమ్నవర్గాల అభ్యున్నతి తదితర అంశాలతోపాటు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కూడా సుదీర్ఘంగా చర్చించినట్టు తెలిసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కూడా చర్చించుకున్నారు. కేవలం ఓట్లు, సీట్ల కోసమే కాకుండా భవిష్యత్తులో కూడా కలిసి పనిచేయాలనే నిర్ణయానికి వచ్చారు ఈ సందర్భంగా రాష్ట్రంలో బీఎస్పీతో కలిసి పనిచేసేందుకు బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి అభ్యంతరంలేదని కేసీఆర్ స్పష్టంచేశారు.