హైదరాబాద్, మార్చి 16(నమస్తే తెలంగాణ) : పద్దులపై చర్చ, ఆమోదానికే పరిమితం చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశా లు ఏర్పాటు చేసిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆరు గ్యారెంటీల అమలు, 420 హామీలపై చర్చించేందుకు ప్రైవేట్ బిల్లు పెట్టాలని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నిర్ణయించిన క్ర మంలో రేవంత్ సర్కార్ జాగ్రత్తపడ్డట్టు తెలుస్తున్నది. అందుకే పద్దులపై తప్ప మరే ఇతర అంశాలపై చర్చకు తావులేకుండా బడ్జెట్ సమావేశాలను కుదించినట్టు చర్చ జరుగుతున్నది. సోమవారం అసెంబ్లీ హాల్లో బీఏసీ సమావేశం నిర్వహించారు. మార్చి 20న బడ్జెట్ ప్రవేశపెట్టి, 30న ద్రవ్య వినిమయ బిల్లును పాస్ చేయించే లా ప్రణాళిక రూపొందిస్తూ మొత్తం 11రోజులు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో నిర్ణయించారు.
మంగళ, బుధవారాల్లో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదం తెలిపే తీర్మానంపై చర్చ జరగనున్నది. 20న అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నది. ఆపై 23నుంచి 26 వరకు బడ్జెట్పై చర్చ లు జరిపి, మార్చి 30న ద్రవ్య వినిమయ బి ల్లుపై చర్చిస్తారు. ఉగాది, రంజాన్, శ్రీరామనవమికి అసెంబ్లీకి సెలవులు ప్రకటించారు. బీఏసీ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార, మంత్రి శ్రీధర్బాబు, విప్ బీర్ల ఐల య్య, బీఆర్ఎస్ నుంచి హరీశ్రావు, కేపీ వివేకానంద, బీజేపీ నుంచి మహేశ్వర్రెడ్డి, ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్, సీపీఐ నుంచి కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. కాగా బీఏసీ మీటింగ్కు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గైర్హాజరయ్యారు.
ప్రతిపక్షాలు పట్టుబట్టినా..
బడ్జెట్ సమావేశాల పొడిగింపుపై ప్రతిపక్షాలు పట్టుబట్టినా ఫలితం లేకుండా పోయింది. అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నాయని, కనీసం 20రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించాలని బీఆర్ఎస్ పక్ష ఉపనేత హరీశ్రావు పదే పదే విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం మాత్రం 11రోజులకే పరిమితం చేసింది. అంతేగాక ఆదివారాలు కూడా సభ నిర్వహించాలని సూచించినట్టు తెలిసింది. మూసీ ప్రక్షాళన, బుల్డోజర్ పరిపాలన, ఆరు గ్యారెంటీలు, 420 హామీలు, రైతుబంధు, ఫీజు రీయింబర్స్మెంట్, రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిలు, డీఏలు, ఆటోడ్రైవర్ల హామీలపై దీర్ఘకాలిక చర్చ పెట్టాల్సిన అవసరం ఉన్నదని హరీశ్రావు బీఏసీ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. గోదావరి నదీ జలాల వివాదంపై చర్చకు హరీశ్రావు డిమాండ్ చేసినట్టు తెలిసింది. ఇదే తరహా డిమాండ్లపై బీజేపీ కూడా సమయం కోరినట్టు తెలిసింది.