నిజామాబాద్, మే 30 (నమస్తేతెలంగాణ ప్రతినిధి): తెలంగాణ ప్రజల సంక్షేమమే బీఆర్ఎస్ కార్యకర్తల లక్ష్యమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. దేశంలో ఇప్పటివరకు ఎవరూ చేయని మంచి పనులను సీఎం కేసీఆర్ చేసి చూపించారని తెలిపారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండల బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం మామిడిపల్లిలోని వంజరి ఫంక్షన్ హాలులో జరిగింది. కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డితోపాటు కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అద్భుతంగా పనిచేస్తున్నారని కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో జీవన్రెడ్డిపై ఎవరైనా పోటీ చేయాలంటే మైసమ్మకు పొటేల్ను బలి ఇచ్చినట్టేనని స్పష్టంచేశారు. ఇతర పార్టీల నేతలు గెలిచే అవకాశం లేనందున ఆశలు వదిలేసుకోవాలని సూచించారు. బీఆర్ఎస్ పార్టీని తొలి నాళ్లలో ఇదేమి పార్టీ అని అవహేళన చేశారని, కానీ ఇప్పుడు అదే గులాబీ పార్టీ ద్వారా ప్రతి ఇంటికి మూడేసి పథకాలు అందుతున్నాయని చెప్పారు. గులాబీ సైనికులు చిందించిన స్వేదం నేడు చెరువుల్లో కనిపిస్తున్న మంచినీటి చుక్కలని తెలిపారు. బీఆర్ఎస్ కార్యకర్తల త్యాగమే కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపమని చెప్పారు. బీఆర్ఎస్ ఉట్టి రాజకీయ పార్టీ కాదు.. ఎంతో కష్టం, కోపం, ఆవేదన, ప్రేమతో పుట్టుకొచ్చిన పార్టీ, ప్రజల ను బాగు చేయాలని భావించిన పార్టీ అని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాలో కార్మిక శాఖ తరఫున ఈఎస్ఐ దవాఖానను నిర్మించాలని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిని కవిత కోరారు. తద్వారా పక్కనే ఉన్న కామారెడ్డి ప్రజలకూ లాభం జరుగుతుందని తెలిపారు. భవన నిర్మాణ కార్మికులు నిజామాబాద్లో పెద్ద సంఖ్యలో ఉంటారని వారికి బీమా సౌకర్యం కల్పించి ఆదుకోవాల ని కోరారు.
కాంగ్రెస్,బీజేపోళ్లను తరమండి : మల్లారెడ్డి
తెలంగాణలో ఎక్కడ చూసినా ఆడబిడ్డలు, అన్నదమ్ములు, స్కూల్ పిల్లలందరూ ఆనందంగా ఉన్నారని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఏ రాష్ట్రంలోనూ ప్రజలు ఇంత ఆనందంగా లేరని, ఇంత అభివృద్ధి లేదని తెలిపారు. బీజేపీ పాలిస్తున్న రాష్ర్టాల్లో తెలంగాణ మాడల్ లేదన్నారు. కాంగ్రెస్ ఉన్నప్పుడు నీళ్లు, కరెంట్, రూ.2 వేల పింఛన్లు, రైతుబంధు, దళితబంధు, రైతుబీమా అమలుకు నోచుకోలేదని తెలిపారు. వారంతా గతంలో దరిద్రం చేసి పోయారన్నారు. నిజామాబాద్లో అర్వింద్ ఉన్నట్టే మల్కాజిగిరిలో రేవంత్రెడ్డి పనికి రాని ఎంపీగా ఉన్నాడని మంత్రి విమర్శిం చారు. వీరంతా అధికారంలోకి వస్తామంటూ కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలకు కాంగ్రెస్ మోసం, ద్రోహం చేసిందని అన్నారు. ఈసారి కాంగ్రెస్, బీజేపీ పేరు చెప్పుకొని ఎవ్వరన్నా ఓటు వేయాలని వస్తే చీపురు కట్టలతో కొట్టాలని మంత్రి మల్లారెడ్డి పిలుపునిచ్చారు.
బండి, రేవంత్ రాష్ర్టానికి పట్టిన దరిద్రం: జీవన్రెడ్డి
తెలంగాణ మాడల్ దేశ వ్యాప్తంగా కీర్తి గడిస్తున్నదని ఎమ్మెల్యే జీవన్రెడ్డి అన్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఏపీతో సహా అన్ని రాష్ర్టాల్లో తెలంగాణ పథకాలు అమలు జరగాలని ఆ రాష్ర్టాల ప్రజలు కోరుకుంటున్నారని తెలిపా రు. రేవంత్రెడ్డి, బండి అష్టదరిద్రులని పేర్కొన్నారు. సమ్మేళనంలో మండలి వైస్ చైర్మన్ ప్రకాశ్, టీఎస్డబ్ల్యూసీడీసీ చైర్పర్సన్ ఆకుల లలిత, జడ్పీ చైర్మన్ విఠల్రావు పాల్గొన్నారు.
నమస్తేతెలంగాణ, టీన్యూస్లను ఆదరించండి
2001లో టీఆర్ఎస్ ఆవిర్భవించినప్పుడు అన్ని పేపర్లు పార్టీకి వ్యతిరేకంగా రాసినవేనని ఎమ్మెల్యే కవిత చెప్పారు. ‘మన పార్టీ స్థాపించిన నమస్తే తెలంగాణ, టీన్యూస్ చానళ్లను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలి’ అని ఆమె కోరారు. ప్రతి ఒక్కరూ పత్రికను చదవేలా, అందులో వచ్చిన అంశాలపై ప్రజల్లో చర్చ పెట్టేవిధంగా చూడాలని అన్నారు. టీన్యూస్ చానల్ యూట్యూబ్ చానల్ సబ్ స్క్రిప్షన్ చేయాలని కోరారు. తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన కథనాలను ప్రజలకు తెలియజేయాలని సూచించారు. మండల, గ్రామ స్థాయి లో పార్టీ బాధ్యులంతా చొరవ తీసుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రతి పార్టీకి పేపర్, చానళ్లు ఉన్నాయని తెలిపారు. ‘బీజేపోడి చానల్ మన గురించి చూపెట్టది. మన చానల్ అయితేనే మన వార్తలు చూపిస్తది. మనం ఇంకో చానల్ చూసుడెందుకు?’ అని వ్యాఖ్యానించారు. మంచి వార్తల కోసం టీన్యూస్ సబ్ స్ర్కైబ్ చేయాలని కోరారు.