రాయపర్తి/గణపురం, మే 23: ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అహర్నిశలు పాటుపడుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి రాష్ట్రంలోని సబ్బండ వర్గాల ప్రజల నుంచి వస్తున్న అపూర్వ ఆదరణను చూసి ఓర్వలేకనే ప్రతిపక్ష పార్టీలు కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని గన్నారంలో మంగళవారం ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి అధ్యక్షతన బీఆర్ఎస్ శ్రేణులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రంలో ఉనికిని చాటుకోవాలన్న ఉద్దేశంతోనే బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు అడ్డు తగులుతున్నాయని మండిపడ్డారు. ప్రజల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా కోట్లాది రూపాయల వ్యయంతో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న బీఆర్ఎస్ పార్టీకే ప్రజలు అండగా నిలవాలని మంత్రి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ మరోమారు అధికారంలోకి వస్తే.. దేశ రాజకీయాలను శాసించే శక్తిగా తెలంగాణ రాష్ట్రం అవతరిస్తుందని వివరించారు. అనంతరం పార్టీ శ్రేణులతో సమస్యలు, గ్రామాల అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ ఎర్రబెల్లి ఉష తదితరులు పాల్గొన్నారు.
జయశంకర్ భూపాలపల్లి గణపురం మండలంలోని చెల్పూర్లో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్యే గండ్ర, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలే తన బలం, బలగమని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కృషితో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని చెప్పారు. 24 గంటల ఉచిత కరెంట్, ఏటా రెండు పంటలకు పుష్కలంగా సాగునీరు అందిస్తున్నదని పేర్కొన్నారు. వరంగల్ జడ్పీ చైర్పర్సన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీనీ భుజాల మీద వేసుకొని గెలిపించేది కార్యకర్తలేనని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వమని, రైతులు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలనన్నదే ఆయన లక్ష్యమని వివరించారు.