హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్, బీఎస్పీ కలిసి పోటీచేస్తాయని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆదివారం ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ జాతీయస్థాయిలో ఎన్డీయే, ఇండియా కూటమిలో లేనందువల్ల ఆ పార్టీతో కలిసి ముందుకు వెళ్లేందుకు పార్టీ అధినేత్రి మాయావతి అనుమతిచ్చారని తెలిపారు. బీఆర్ఎస్, బీఎస్పీ కూటమి పోటీచేసే స్థానాలపై త్వరలోనే సంయుక్త ప్రకటన ఉంటుందని వివరించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో జరిగే తదుపరి చర్చలకు పార్టీ అధినేత్రి మాయావతి దూతగా రాజ్యసభ సభ్యుడు, కేంద్ర సమన్వయకర్త రాంజీగౌతమ్ హాజరవుతారని తెలిపారు. ఇరు పార్టీల మధ్య సీట్ల పంపకాలు, ఉమ్మడి భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే సంయుక్తంగా మీడియాకు వెల్లడిస్తామని పేర్కొన్నారు. బీఎస్పీ, బీఆర్ఎస్ పొత్తులపై మీడియాలో వస్తున్న నిరాధార వార్తలు, వదంతులు, దుష్ప్రచారాలను పార్టీ శ్రేణులు, ప్రజలు నమ్మవద్దని ప్రవీణ్కుమార్ విజ్ఞప్తి చేశారు.