బ్రిటిష్ పాలకులు భారతీయులకు నాగరికత తెలియదని, చాలా వెనుకబడిన జాతి అని ప్రచారం చేసేవారు. వారి ఆచార వ్యవహారాలను ఈసడించేవారు. ‘వాళ్లను బాగుచేసి నాగరికతను నేర్పే గురుతురమైన భారం తెల్లోడి భుజస్కంధాలపై పడిందని’ రుడ్యార్డ్ కిప్లింగ్ లాంటి బ్రిటిష్ రచయితలు తెగ వాపోయారు. ఇక గవర్నర్ జనరల్ లార్డ్ కర్జన్ అయితే భారతీయులకు, నిజాయితీకి చుక్కెదురు అని తేల్చేశాడు.
బ్రిటిష్ న్యాయవ్యవస్థలో మెల్లమెల్లగా భారతీయ న్యాయమూర్తులను నియమించే ఆచారం వచ్చినప్పటికీ యూరోపియన్లను విచారించే అధికారం మాత్రం వారికి లేకుండా చేశారు. ఇండియన్స్ను యథేచ్ఛగా చంపేసినా బ్రిటిషర్లు సహా యూరోపియన్లకు అంతంత మాత్రం శిక్షలే పడేవి. ఆ పద్ధతి పోవాలని కొందరు ప్రయత్నించారు. కానీ ఫలితం దక్కలేదు. 1883లో భారతీయ న్యాయమూర్తులకు యూరోపియన్ పౌరులను విచారించే అధికారం కల్పిస్తూ ఇల్బర్ట్ బిల్లు వచ్చింది. దానిపై తెల్లదొరలు నానా యాగీ చేసి బ్రిటిష్ ప్రభుత్వం ఆ బిల్లును వెనుకకు తీసుకొనేదాకా నిద్రపోలేదు. ఇదీ బ్రిటిష్ వాడి న్యాయం!