హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ) : టీహబ్, వీ-హబ్, టీబీఐఎస్ బిట్స్ పిలానీ (హైదరాబాద్) భాగస్వామ్యంతో గ్రామీణ స్థాయి ఆంత్రప్రెన్యూర్లను వెలుగులోకి తేవడమే లక్ష్యమని సెర్ప్ సీఈవో దివ్యాదేవరాజన్ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం టీహబ్లో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ రాష్ర్టానికి కేటాయించిన రూ.12.66 కోట్ల చాలెంజ్ ఫండ్ను ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడారు. గ్రామీణ ఆంత్రప్రెన్యూర్లను ప్రోత్సహించడమే లక్ష్యంగా టీహబ్తో స్వయం సహాయ బృందాలు(సెర్ప్) భాగస్వామ్యం ఏర్పర్చుకున్నట్టు వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో గ్రామీణ ఆంత్రప్రెన్యూర్లను భాగం చేస్తామని చెప్పారు.
ఈ నిధులతో 65లక్షల మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలకు మైక్రోఫైనాన్స్ సౌకర్యం కల్పించి ఆంత్రప్రెన్యూర్లుగా తీర్చిదిద్దుతామన్నారు. దాదాపు 300 మంది యువ మహిళా ఆంత్రప్రెన్యూర్లు స్కిల్స్ మెరుగుపర్చుకునేందుకు ప్రోత్సాహం అందిస్తామని వెల్లడించారు. ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వ్యవసాయ అనుబంధ సంస్థలు, తయారీ, ఫుడ్ ప్రాసెసింగ్, హస్త కళలు తదితర రంగాల్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో టీహబ్ సీఈవో కవికృత్, వీహబ్ సీఈవో సీత పల్లచోళ, టీబీఐఎస్ బిట్స్ పిలానీ మేనేజర్ మీర్ అలీ తదితరులు పాల్గొన్నారు.