Brijesh Tribunal | హైదరాబాద్, మార్చి23 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా నదీ జలాలను ఇష్టారీతిన ప్రాజెక్టులను కేటాయించిన తీరుపై ఏపీ ప్రభుత్వాన్ని బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ సూటిగా ప్రశ్నించింది. ‘నాడు మీరు చేసిందే నేడు తెలంగాణ ఆచరిస్తున్నదనే అభిప్రాయాన్ని వెలిబుచ్చినట్టు తెలిసింది. ఏపీ లేవనెత్తిన అభ్యంతరాలపై ఆదిలోనే ట్రిబ్యునల్ పెదవి విరిచిందని సమాచారం. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 90 టీఎంసీల కృష్ణా జలాలను కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 246పై స్టే విధించాలని కోరుతూ ఏపీ దాఖలు చేసిన పిటిషన్పై బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ గురువారం ఢిల్లీలో విచారణ ప్రారంభించింది.
ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ బ్రిజేశ్కుమార్, సభ్యులు జస్టిస్ రామ్మోహన్రెడ్డి, జస్టిస్ తలపాత్ర తొలుత ఏపీ వాదనలకు అనుమతించారు. ఈ సందర్భంగా పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ సీమ్కు సంబంధించి నీటి కేటాయింపులు, ప్రాజెక్టు ప్రతిపాదిత ఇన్టేక్ పాయింట్ మార్పులు తదితర అంశాలపై ఏపీ సీనియర్ న్యాయవాది ఉమాపతి పలు అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ట్రిబ్యునల్ నిబంధనలు, ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్లు, తెలంగాణ రాష్ట్రం గతంలో జారీచేసిన జీవోల వంటి అనేక ఇతర పత్రాలను ప్రస్తావించారు.
ఈ సందర్భంగా ట్రిబ్యునల్ చైర్మన్ బ్రిజేశ్కుమార్ ఏపీ వాదనలపై ఆదిలోనే పెదవి విరిచారని తెలిసింది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ప్రాజెక్టులకు నీటి కేటాయింపులపై ఏపీ అనుసరించిన విధానాలనే నేడు తెలంగాణ అనుసరిస్తున్నదని, అందులో కొత్తేమి ఉన్నదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. శుక్రవారం సైతం ట్రిబ్యునల్లో ఏపీ తరఫున సీనియర్ న్యాయవాది జయదీప్ గుప్తా వాదనలు వినిపించనున్నారు. విచారణకు తెలంగాణ తరఫున సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్, ఇతర న్యాయవాదులు, సీనియర్ ఇంజినీర్లు హాజరయ్యారు.