మాదాపూర్ : తెలంగాణలో డెయిరీ, ఫుడ్ రంగాలకు ఉజ్వల భవిష్యత్ ఉందని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. మాదాపూర్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఏర్పాటు చేసిన డెయిరీ, ఫుడ్ ఎక్స్ పో (2023) ను తెలంగాణ రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్ సోమ భరత్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పోషకాహార గుణాలను కలిగి ఉండే పాలకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో డిమాండ్ ఉందని అన్నారు.
హైదరాబాద్ నగరానికి ప్రతి రోజు కోటి లీటర్ల పాలు అవసరం కాగా 60 నుంచి 70 లక్షల లీటర్ల వరకు మాత్రమే సరఫరా అవుతుందని అన్నారు. అదనపు పాల ఉత్పత్తికి మరిన్ని పశువుల పెంపకం అవసరం ఉంటుందని అన్నారు. టీఎస్డీడీసీఎఫ్ చైర్మన్ సోమ భరత్ మాట్లాడుతూ మూతపడే స్థితికి చేరుకున్న విజయ డెయిరీ నేడు ఎవరూ ఊహించనంత గొప్పగా ఎదిగిందని అన్నారు.
రూ. 7 వందల కోట్ల టర్నోవర్ సాధించి వేయి కోట్ల లక్ష్యంతో ముందుకు సాగుతుందని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా విజయ డెయిరీ మరో 2 వేల ఔట్లెట్లను ఏర్పాటుచేసేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుతం వేయి అవుట్ లెట్లను కలిగి ఉండటంతో పాటు తమ ఫోర్ట్పోలియోలను కూడి విస్తరిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం 27 రకాల ఉత్పత్తులు ఉండగా మిల్క్ షేక్, కాఫీ, టీ, ఫ్లేవర్డ్ మిల్క్, ఐస్ క్రీం, కుల్ఫీ, కుకీలు, హెల్త్ బార్లు మొదలైన 100 రకాల కొత్త ఉత్పత్తులను జోడించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
మారుమూల ప్రాంతాల్లో యానిమల్ మొబైల్ మెడికల్ అంబులెన్స్లు వందల సంఖ్యలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. టోల్ ఫ్రీ నెంబర్ 1962 అంబులెన్స్ సేవలకు కనెక్టివిటీని అందిస్తుందన్నారు. కల్తీ లేని పాలను గుర్తించడానికి తమ తనిఖీ బృందాలు పనిచేస్తున్నాయని వెల్లడించారు.