వనపర్తి : తన జీవిత భాగస్వామితో నిండూ నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవించాలని కోటి ఆశలతో పెండ్లి(Marriage)కి సిద్ధమయ్యాడు ఆ యువకుడు. వేద మంత్రాల సాక్షిగా మరికొద్ది క్షణాల్లో పెళ్లి కూతురి మెడలో తాళి కట్టాల్సిన వరుడు(Groom)కి పెళ్లి కూతురు(Bride) సినిమా సీన్లను తలదన్నేలా షాకిచ్చింది. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదని తాళి కట్టనివ్వకుండా పెళ్లి పీటల మీద నుంచి లేపోయింది.
దీంతో ఒక్కసారిగా వరుడు, అతడి కుటుబ సభ్యులు, వివాహానికి హాజరైన అతిథులు విస్తుపోయారు. ఈ సంఘటన కొత్తకోట మండలంలోని కానాయపల్లి(Kanayapalli)లో చోటు చేసుకుంది. కానాయపల్లి స్టేజి సమీపంలో శ్రీదత్త కోటిలింగేశ్వర ఆలయంలో గీతాంజలి(20) అనే యువతికి కొత్తకోట పట్టణానికి చెందిన ప్రవీణ్ కుమార్ యాదవ్(23)తో వివాహం నిశ్చమైంది.
గురువారం ఉదయం వీరి పెళ్లి ఆలయ ప్రాంగణంలో జరగాల్సి ఉండగా తాళికట్టే ఒక నిమిషం ముందు పెళ్లి కొడుకు ఇష్టం లేదని, తాళిని పక్కకు నెట్టివేసి పెళ్లి పీటల మీద నుంచి గీతాంజలి వెళ్లిపోయింది. అంతకు ముందు పెళ్లికూతురు బట్టలు మార్చుకునే సమయంలో పెళ్లి కూతురు తల్లి ఎంత చెప్పినా వినకుండా బలవంతంగా పెళ్లి పీటల మీదికి తీసుకువచ్చింది. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని, పెళ్లి కొడుకుకు నత్తి ఉందని చెప్పి తాళి కట్టనివ్వకుండా గీతాంజలి పెళ్లి పందిరి నుంచి వెళ్లిపోయింది. చేసేదిమే లేక ఇరు కుటుంబాలు వివాహాన్ని రద్దు చేసుకున్నాయి.