సిరిసిల్ల రూరల్, జూన్ 3: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం తాడూరు వ్యవసాయ విస్తరణాధికారి అజీజ్ఖాన్ అక్రమ వ్యవహరం బట్టబయలైంది. ఆన్లైన్లో పంటల నమోదు కోసం పాసుబుక్కు రూ.500 లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కయ్యాడు. ఓ బాధితుడు శుక్రవారం రహస్యంగా వీడియోతీసి సోషల్మీడియాలో పోస్ట్చేసిన వీడియో కలకలం సృష్టించింది.
ఫోన్పే, గూగుల్పే ద్వారా డబ్బులు జమ చేయాలని రైతులతో ఏఈవో జరిపిన సంభాషణతో కూడిన వీడియో వైరల్గా మారింది. సత్వరమే స్పందించిన కలెక్టర్ అనురాగ్ జయంతి ఏఈవోను సస్పెండ్ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలోనూ అవినీతి ఆరోపణలపై రెండుసార్లు అజీజ్ఖాన్ సస్పెండయ్యారు. ఏఈవో వ్యవహారం వ్యవసాయశాఖను కుదిపేసింది.