యాదాద్రి: రాష్ట్రంలో ప్రముఖ ఆలయమైన యాద్రాద్రిలో ఈ నెల 30న స్వామివారి ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలను అధికారులు రద్దుచేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మినరసింహ స్వామివారిని దర్శించుకోనున్నారు. ఈనేపథ్యంలో శుక్రవారం.. ఉదయం సుప్రభాతం నుంచి మధ్యాహ్నం ఆరగింపు వరకు నిర్వహించే ఆర్జిత సేవలు, ప్రత్యేక, ధర్మదర్శనాలను రద్దు చేస్తున్నామని ఆలయ ఈవో గీత చెప్పారు. అదేవిధంగా ఉదయం 9 నుంచి 10 గంటల వరకు బ్రేక్ దర్శనాలను కూడా క్యాన్సల్ చేస్తున్నామని వెల్లడించారు. నిత్యకైంకర్యాలను ఆంతరంగికంగా నిర్వహిస్తామని తెలిపారు. కాగా, ఇప్పటివరకు యాదాద్రీశ్వరుడిని నలుగురు రాష్ట్రపతులు మాత్రమే దర్శించుకోవడం విశేషం.
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ నెల 30న ఉదయం 8.50 గంటలకు హైదరాబాద్లోని బొల్లారంలోని రాష్ట్రపతి భవన్ నుంచి ఈఎంఈ హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి ఐఏఎఫ్ ఎం17 హెలికాప్టర్లో యాదగిరిగుట్ట దేవస్థానం వద్ద హెలిప్యాడ్ స్థలానికి చేరుకుంటారు. 9.50 గంటలకు ప్రత్యేక వాహనంలో కొండపైకి బయల్దేరుతారు. 10 నుంచి 10.30 గంటల మధ్య స్వయంభూ నరసింహుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. 10.40కి యాదాద్రి హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. ఉదయం 10.50 గంటలకు తిరిగి హైదరాబాద్లోని బొల్లారం హెలిప్యాడ్ వద్దకు, 11.30 గంటలకు రాష్ట్రపతి భవన్కు చేరుకుంటారు.
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము యాదగిరి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు వస్తున్నారన్న సమాచారంతో గతంలో యాదగిరీశుడిని దర్శించుకున్న రాష్ట్రపతులపై చర్చ సాగుతున్నది. తొలి రాష్టపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్, 2వ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణణ్, 9వ రాష్ట్రపతి డాక్టర్ శంకర్దయాల్శర్మ, 13వ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. తాజాగా 15వ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నారసింహుడిని దర్శించుకోనున్నారు.