హైదరాబాద్ : కార్పొరేట్ ఆస్పత్రుల్లో లక్షల రూపాయాలు విలువజేసే శస్త్రచికిత్సలను ఉచితంగా నిర్వహిస్తున్న గాంధీ దవాఖాన వైద్యులు మరో ఘనత సాధించారు. స్పృహలో ఉన్న వృద్ధురాలి మెదడులోని కణితిని ‘అవేక్ క్రేనియటోమి’ శస్త్రచికిత్స ద్వారా విజయవంతంగా తొలగించారు. ఆమెకు మెగాస్టార్ చిరంజీవి నటించిన అడవి దొంగ సినిమా చూపిస్తూ సర్జరీ నిర్వహించారు. ఆ సర్జరీ విజయవంతం కావడంతో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు గాంధీ వైద్యులపై ప్రశంసల వర్షం కురిపించారు.
ఇక చిరంజీవికి కూడా ఈ విషయం తెలియడంతో గాంధీ వైద్యులను ప్రశంసించారు. ఆమె అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు. ఆమె వివరాలు తెలుసుకోమంటూ తన పీఆర్వో ఆనంద్ను గాంధీ ఆస్పత్రికి పంపారు. ఈ నేపథ్యంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావును చిరు పీఆర్వో కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆనంద్ ఆపరేషన్ చేయించుకున్న మహిళను కలిసి మాట్లాడారు. తాను చిరంజీవి అభిమానినని, ఆయన సినిమాలను క్రమం తప్పకుండా చూస్తానని ఆమె చెప్పారు. అనంతరం ఆనంద్ అక్కడి నుంచే చిరంజీవికి ఫోన్ చేసి విషయం చెప్పారు. వీలు చూసుకుని రెండుమూడు రోజుల్లో ఆసుపత్రికి వస్తానని చెప్పడంతో ఆ విషయాన్ని ఆనంద్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావుకు చెప్పారు.
యాదాద్రి జిల్లా తిరుమలాపురం గ్రామానికి చెందిన సత్తెమ్మ(60)కు మెదడులోని ‘మోటర్ కార్టెక్స్’ ప్రాంతంలో కణితి ఏర్పడింది. సాధారణంగా మోటర్ కార్టెక్స్ భాగంలో కాళ్లు, చేతులకు సంబంధించిన నరాలు ఉంటాయని, ఆ భాగంలో ఆపరేషన్ చేసినప్పుడు కాళ్లు,చేతులు పడిపోయి పక్షవాతం వచ్చే అవకాశాలు ఉండడం వల్ల రోగిని స్పృహలో ఉంచే ఆపరేషన్ చేస్తామని గాంధీ దవాఖాన సర్జికల్ న్యూరో విభాగాధిపతి డాక్టర్ శ్రీనివాస్ వివరించారు. సత్తెమ్మ మెదడు పైపొరలు, చర్మానికి మాత్రమే అనస్తీషియా ఇచ్చి, రోగిని స్పృహలో ఉంచే ఆపరేషన్ చేశామని వివరించారు. రోగికి అడవి దొంగ సినిమా చూపిస్తూ, మాటల్లో పెట్టి అతిజాగ్రత్తగా నరాలకు ఎలాంటి హాని కలగకుండా డాక్టర్ ప్రకాశ్రావు తన బృందంతో కలిసి శస్త్రచికిత్స నిర్వహించినట్లు తెలిపారు. ఆపరేషన్లో డాక్టర్ నాగరాజు, అనస్తీషియా వైద్యులు డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ సారయ్య, డా.ప్రతీక్ష, డా.అబ్బయ్య పాల్గొన్నారు.
ఒక ప్రాణాన్ని కాపాడేందుకు తమ వృత్తి ధర్మంలో నైపుణ్యతను ప్రదర్శించి, పేషెంట్ స్పృహలో ఉండేలా ఇష్టమైన సినిమా చూపిస్తూ, గాంధీ ఆసుపత్రి వైద్యులు
నిర్వహించిన అరుదైన సర్జరీ అందరినీ ఆకట్టుకుంది. @KChiruTweets గారి ప్రశంస, మా ప్రభుత్వ వైద్యులకు మరింత ఉత్సాహాన్ని అందిస్తుంది. pic.twitter.com/JPK4qW2bJu— Harish Rao Thanneeru (@trsharish) August 27, 2022