యాదాద్రి భువనగిరి : ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో మార్చి 4వ తేదీ నుంచి జరుగుతున్న బ్రహ్మోత్సవాలు సోమవారం వైభవంగా ముగిశాయి. అష్టోత్తర శతఘటాభిషేకంతో బ్రహ్మోత్సవాలను అర్చకులు ఘనంగా ముగించారు. బాలాలయంలో 108 కలశాలను వరుసగా పేర్చి వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య, మంగళ వాయిద్యాల హోరు నడుమ కలశాలకు ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం 108 కలశాల్లో ఉన్న జలంతో స్వామివారికి అర్చనాభిషేకాలు నిర్వహించి స్వామిఅమ్మవార్లను గర్భాలయంలోకి తీసుకెళ్లారు. అంతకుముందు దాదాపు 2 గంటల పాటు హోమంను శాస్త్రోత్తంగా నిర్వహించిన అర్చకులు 11 రోజులుగా అంగరంగ వైభవంగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలకు ముగింపు పలికారు. అనంతరం పండితులు, యాజ్ఞికులు, పారాయణం దారులకు ఘనంగా సన్మానించారు.