Brahmana Sadanam | హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా గోపన్పల్లిలో నిర్మించిన బ్రాహ్మణ సదనంలో వివిధ కార్యక్రమాల నిర్వహణకు తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు అవకాశం కల్పిస్తున్నదని పరిషత్తు ఛైర్మన్ డా. రమణాచారి తెలిపారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న బ్రాహ్మణులకు ఉచితంగా కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆదివారం గోపన్పల్లిలోని బ్రాహ్మణసదన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రమణాచారి మాట్లాడుతూ.. కేటాయింపులో దారిద్ర రేఖకు దిగువన(బీపీఎల్) ఉన్న పేద బ్రాహ్మణ వర్గానికి మొదటి ప్రాధాన్యత, దారిద్రరేఖకు ఎగువన ఉన్న బ్రాహ్మణ వర్గానికి ద్వితీయ ప్రాధాన్యత కల్పించనున్నట్లు తెలిపారు. బ్రాహ్మణేతర హిందువులు సైతం కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు అవకాశం కల్పిస్తామన్నారు.
కేటాయింపులో ప్రాధాన్యత, అద్దె నిర్ధారణకు తహశీల్దారు జారీచేసిన కుల, ఆదాయ ధృవీకరణ పత్రం తప్పనిసరి అని స్పష్టంచేశారు. అశుభ కార్యక్రమాల నిర్వహణకు సదనాన్ని కేటాయించరాదని, అలాగే, శాఖాహార వంటకాలను మాత్రమే ప్రాంగణంలో అనుమతించాలని నిర్ణయించామన్నారు. ఇందులో శుభకార్యాలు జరిపేందుకు పురోహితులు అందుబాటులో ఉంటారని, క్యాటరింగ్ సౌకర్యాన్ని కూడా ఉంటుందని చెప్పారు. నెలరోజుల ముందు ఆన్లైన్ ద్వారా బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందని, మరిన్ని వివరాలకు brahminparishad.telangana.gov.in వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు.
– బీపీఎల్ బ్రాహ్మణ కుటుంబాలకు- ఉచితం
– దారిద్రరేఖకు ఎగువన ఉన్న బ్రాహ్మణులకు- రూ. 10,000
– బ్రాహ్మణేతరుల హిందువులకు- రూ. 50,000