మానకొండూర్ రూరల్, అక్టోబర్ 4: ప్రమాదవశాత్తు షార్ట్సర్క్యూట్తో ఇల్లు దగ్ధం కాగా, ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారి సజీవదహనమైన ఘటన కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ఈదులగట్టెపల్లిలో చోటుచేసుకున్నది. ఈదుటగట్టెపల్లి గ్రామానికి చెందిన అంగిడి అనిత-రాజు దంపతులకు కూతురు రితిక, కుమారుడు సాయికుమార్ (7) ఉన్నారు. శుక్రవారం సాయంత్రం సాయికుమార్ ఇంట్లో నిద్రిస్తుండగా.. తల్లీకూతురు బయట ఉన్నారు. షార్ట్సర్క్యూట్తో ఆరుబయట ఉన్న తాటికమ్మలకు మంటలు అంటుకోగా సాయికుమార్ నిద్రలేచే సరికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. స్థానికులు కాపాడేందుకు ప్రయత్నించినా.. మంటల వ్యాప్తికి ఏం చేయలేకపోయారు. సాయికుమార్ మరో రూమ్లోకి వెళ్లి డోర్ పెట్టుకున్నాడు. అప్పటికే మంటల వ్యాప్తి, పొగతో ఊపిరాడక మూలన పడిపోయాడు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సజీవదహనమైన బాలుడి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. పండుగపూట సాయికుమార్ మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొన్నది. ఘటనా స్థలాన్ని మానకొండూర్ ఇన్చార్జి సీఐ స్వామి పరిశీలించి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.