Telangana | హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): భారత్లో టెక్ కంపెనీలకు ప్రధాన కేంద్రంగా అవతరించిన తెలంగాణలో రోజురోజుకూ పెరుగుతున్న వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకొనేందుకు అనేక అంతర్జాతీయ సంస్థలు పోటీపడుతున్నాయి. అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కే తారకరామారావుతో పోటీలు పడి సమావేశమవుతూ తెలంగాణలో పెట్టుబడి ప్రణాళికలను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే అనేక కంపెనీలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకురాగా, తాజాగా ఆరమ్ ఈక్విటీ పార్ట్నర్స్ కీలక పెట్టుబడి ప్రణాళికతో ముందుకొచ్చింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్, డాటా సెంటర్ తదితర రంగాల్లో దాదాపు రూ.450 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. హైదారాబాద్లో అత్యాధునిక డాటా సెంటర్ల అభివృద్ధి కోసం ఈ నిధులను ఖర్చుచేయనున్నది. రాష్ట్రంలో డీప్ టెక్ స్టార్టప్లకు మద్దతు ఇవ్వడానికి ఆరమ్ వెంచర్స్ పార్ట్నర్స్ సుమారు రూ.41కోట్లు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది. కృత్రిమ మేథ, ఐఓటీ, మెషిన్ లర్నింగ్, బిగ్ డాటా, బ్లాక్ చెయిన్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి సాంకేతికతలు మెయిన్ స్ట్రీమ్లోకి వెళ్తున్నందున డాటా సెంటర్ డెవలపర్లు ఎడ్జ్ కంప్యూటింగ్పై దృష్టి సారించాలని ఆరమ్ సీఈవో వెంకట్ బుస్సా సూచించారు. సోమవారం శాన్ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆరమ్ ఈక్విటీ ఈ మేరకు తమ పెట్టుబడి ప్రణాళికలను ప్రకటించింది.
డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ సేవలు, పరిష్కారాల్లో దిగ్గజ సంస్థ గ్రిడ్ డైనమిక్స్ హోల్డింగ్స్ (ఎన్ఏఎస్డీఏక్యూ-జీడీవైఎన్) హైదరాబాద్లోని తమ డెలివరీ కేంద్రాన్ని మరింత విస్తరించనున్నది. గ్రిడ్ డైనమిక్స్ బోర్డు చైర్మన్ లాయిడ్ కార్నీ, డైరెక్టర్ ఎరిక్ బెన్మౌ, జీఎం-ఇండియా రాజీవ్ శర్మ, విక్రయాలు, భాగస్వామ్యాలకు సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ రాహుల్ బింద్లిష్, తెలంగాణ ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ మంగళవారం శాన్ఫ్రాన్సిస్కోలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్లోని తమ డెలివరీ కేంద్రాన్ని విస్తరించనున్నట్టు కంపెనీ ప్రతినిధులు ప్రకటించారు. గ్రిడ్ డైనమిక్స్ డిజిటల్-నేటివ్ టెక్నాలజీ సేవలను అందించే సంస్థ. ఇది తమ సేవల ద్వారా ఫార్చ్యూన్ 1000 కంపెనీల వృద్ధిని వేగవంతం చేయడంతోపాటు పోటీ ప్రయోజనాన్ని పెంచుతున్నది. సిలికాన్ వ్యాలీ ప్రధాన కేంద్రంగా 2006లో ఏర్పాటైన ఈ సంస్థ యూఎస్, మెక్సికో, యూరప్తోపాటు భారత్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నది.
పర్యావరణ హిత వాహన టెక్నాలజీ అభివృద్ధి కోసం అమెరికాలోని ప్రఖ్యాత కాలిఫోర్నియా యూనివర్శిటీకి చెందిన జీరో ఎమిషన్ వెహికిల్ (జెడ్ఈవీ) రిసెర్చ్ సెంటర్తో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకొన్నది. సరసమైన ధర, పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయ రవాణా వ్యవస్థ అభివృద్ధికి ఈ ఒప్పందం దోహదపడుతుంది. రాష్ట్ర పరిశ్రమల శాఖతో చేసుకొన్న ఈ ఒప్పందం రెండేండ్లపాటు అమల్లో ఉంటుంది. ఒప్పందంలో భాగంగా ఆర్థికాభివృద్ధికి దోహదంచేసే సమగ్ర జెడ్ఈవీ ప్రణాళికను రూపొందించనున్నారు.
అమెరికాకు చెందిన ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) సేవల సంస్థ ‘స్టేట్ స్ట్రీట్’ హైదరాబాద్లోని తమ శాఖలో సిబ్బంది సంఖ్యను పెంచనున్నట్టు ప్రకటించింది. అదనంగా మరో ఐదు వేల మంది ఉద్యోగులను నియమించుకోనున్నట్టు తెలిపింది. తద్వారా బోస్టన్లోని స్టేట్స్ట్రీట్ ప్రధాన కార్యాలయం తర్వాత అత్యధిక ఉద్యోగులు ఉన్న కార్యాలయంగా హైదరాబాద్ రెండో స్థానంలో నిలువనున్నది. రాష్ట్రంలో బీఎఫ్ఎస్ఐ రంగ అభివృద్ధికి మరింత ఊతం ఇవ్వనున్నది. మంగళవారం స్టేట్ స్ట్రీట్కు చెందిన ప్రతినిధుల బృందం బోస్టన్లో మంత్రి కేటీఆర్తో సమావేశమైంది. సంస్థకు చెందిన అకౌంటింగ్, హెచ్ఆర్ మొబిలిటీ తదితర విభాగాలకు హైదరాబాద్ను ప్రపంచ కేంద్రంగా మార్చనున్నట్టు తెలిపింది. హైదరాబాద్లోని తమ కార్యాలయం పనితీరు పరంగా ప్రపంచంలోని తమ శాఖలన్నింటిలో ముందువరుసలో ఉన్నదని పేర్కొన్నది. కొత్తగా కల్పించే ఉద్యోగాలు ఫండ్ మేనేజ్మెంట్, కస్టోడియన్ సర్వీసెస్, అసెట్ మేనేజ్మెంట్ విభాగాల్లో ఉంటాయని వివరించింది. సంస్థ నిర్ణయంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ‘బోస్టన్ నుంచి శుభవార్త’ అంటూ మంగళవారం ట్వీట్ చేశారు. బోస్టన్లోని స్టేట్ స్ట్రీట్ ప్రధాన కార్యాలయం తర్వాత అత్యధిక ఉద్యోగులు ఉన్న కార్యాలయంగా హైదరాబాద్ రెండో స్థానంలో నిలువబోతుండటం తనకు చాలా గర్వంగా ఉన్నదని పేర్కొన్నారు. స్టేట్ స్ట్రీట్ కార్పొరేషన్ 2017లో హైదరాబాద్లో కార్యకలాపాలను ప్రారంభించింది.