హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం పది నెలల్లో చేసిన అప్పు రూ.70,300 కోట్లకు చేరింది. రేవంత్రెడ్డి సర్కార్ మంగళవారం ఆర్బీఐ నుంచి మరో రూ.2,000 కోట్ల రుణం తీసుకున్నది. రిజర్వు బ్యాంకు మంగళవారం నిర్వహించిన ఈ వేలంలో పాల్గొని ఈ మొత్తం సేకరించింది. 16 ఏండ్ల కాలపరిమితితో 7.61 శాతం వార్షిక వడ్డీకి సెక్యూరిటీ బాండ్లు పెట్టి రూ.1,000 కోట్లు, 26 ఏండ్ల కాలపరిమితితో 7.61 శాతం వార్షిక వడ్డీకి మరో రూ.1,000 కోట్ల రుణ సమీకరణ చేసింది. కాంగ్రెస్ సర్కార్ రాష్ట్ర బడ్జెట్లో రూ.54, 009 కోట్ల రుణ సమీకరణ చేయనున్నట్టు ప్రకటించింది. ఈ రుణ లక్ష్యాన్ని నవంబర్ నాటికే చేరుకున్నది. ఇప్పటికే లక్ష్యానికి మించి రాష్ట్ర ప్రభుత్వం ఒక్క ఆర్బీఐ నుంచి ఓపెన్ మార్కెట్ ద్వారా రూ.68,300 కోట్ల రుణం తీసుకున్నది. తొలి త్రైమాసికంలో రూ.17, 400 కోట్లు, రెండో త్రైమాసికంలో రూ.32, 500 కోట్లు, మూడో త్రైమాసికంలో డిసెంబర్ 31 వరకు రూ.18,400 కోట్లు సేకరించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో నాలుగో త్రైమాసికంలో (జనవరి-మార్చి) రూ.10, 600 కోట్లు అప్పు తీసుకుంటామని ఆర్బీఐకి ప్రతిపాదనలు పంపించింది. అందులో భాగంగా తొలి రుణంగా మంగళవారం రూ.2,000 కోట్లు అప్పు తీసుకున్నట్టు ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.
2025-26 ఆర్థిక సంవత్సరంలో