న్యూఢిల్లీ, అక్టోబర్ 5: తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎమ్మెస్ రామచంద్రరావును పంజాబ్-హర్యానా హైకోర్టుకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. బాంబే హైకోర్టు నుంచి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ను తెలంగాణ హైకోర్టుకు న్యాయమూర్తిగా బదిలీ చేశారు. దేశవ్యాప్తంగా 11 హైకోర్టులకు చెందిన 15 మంది న్యాయమూర్తులను బదిలీ చేస్తూ కేంద్ర న్యాయ శాఖ గెజిట్ నోటిఫికేషన్ను మంగళవారం వెలువరించింది. బదిలీ అయినవారిలో అలహాబాద్ హైకోర్టు నుంచి ఏకంగా నలుగురు న్యాయమూర్తులు ఉన్నారు. ఏపీ హైకోర్టుకు కొత్తగా ఇద్దరు న్యాయమూర్తులను నియమించారు. జడ్జిల బదిలీలపై ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులు చేసింది.
న్యాయవాద కుటుంబం నుంచే..
జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అస్సాం రాజధాని గువాహటిలో 1964, ఆగస్టు 2న జన్మించారు. ఆయన తండ్రి సుచేంద్ర నాథ్ భూయాన్ అస్సాం మాజీ అడ్వొకేట్ జనరల్. ఎన్నో సంక్లిష్ట కేసులను వాదించి గెలిచారు. గువాహటిలోనే ఇంటర్ వరకు విద్యనభ్యసించిన ఉజ్జల్ భూయాన్.. ఢిల్లీలో ఆర్ట్స్ విభాగంలో డిగ్రీ పూర్తి చేశారు. గువాహటి ప్రభుత్వ న్యాయ కళాశాల నుంచి ఎల్ఎల్బీ, గౌహతి యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్ఎం పట్టా పొందారు. 1991లో బార్ కౌన్సిల్లో చేరిన ఆయన.. 2011లో అస్సాం అదనపు అడ్వొకేట్ జనరల్గా నియమితులయ్యారు. అదే ఏడాది గౌహతి హైకోర్టు అదనపు జడ్జిగా అపాయింట్ అయ్యారు. అనంతరం 2019లో బాంబే హైకోర్టు జడ్జిగా ప్రమాణం చేశారు.