సుల్తాన్బజార్( సికింద్రాబాద్ ) : రైతులకు ప్రయోజనం చేకూర్చే విధంగా సహకార బ్యాంకింగ్ రంగం (Cooperative Banking Sector ) లో రెండంచెల విధానం పట్ల బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Government ) సానుకూలంగా ఉందని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్కుమార్ (Boinapally Vinodkumar) అన్నారు. ఈ మేరకు ఆదివారం కోఠిలో అఖిల భారత బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్(ఏఐబీఈఏ) ఆధ్వర్యంలో సహకార రంగంలో నిర్మాణాత్మక మార్పులు అనే అంశంపై సదస్సును నిర్వహించారు.
ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ సహకార బ్యాంకింగ్ రంగంలో రెండంచెల విధానాన్ని ( Two-tier )ఏ విధం గా ముందుకు తీసుకువెళ్లాలనే ప్రతిపాదనలతో యూనియన్లు నివేదికను ఇస్తే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ( CM KCR ) దృష్టికి తీసుకువెళ్తానని వెల్లడించారు. ఈ విధానంపై మరింత అధ్యయనం చేయా ల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. సహకార ఉద్యమం పుట్టినప్పటి కంటే ప్రస్థుత సమాజంలోనే సహకార ఉద్యమం మరింత ఎక్కువగా అవసరముందని అన్నారు.
సహకార ఉద్యమం కంటే ముందు కొద్ది మంది చేత్తుల్లోనే భూమి ఉండేదని తెలిపారు. అనేక రకాల ప్రజా ఉద్యమాల వల్ల భూ సంస్కరణల అమలు అనంతరం భూమి పంపిణీ జరిగి ప్రస్థుతం చిన్న కమతాల రూపంలో వ్యవసాయం జరుగుతుందన్నారు. ఆ ఉద్దేశ్యంతోనే బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు వేదికలను ఏర్పాటు చేసిందని, ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్త రణ అధికారిణి నియమించిందని వివరించారు. సీజన్లో ఎకరానికి రూ.5 వేలు పంట పెట్టుబడి సాయం, పంట రుణాలు అందించి రైతులకు ప్రభుత్వం ఎంతో ధైర్యాన్ని అందిస్తుందని అన్నారు.
ఒకవైపు ప్రైవేట్ బ్యాంకులను జాతీయకరణ ( Nationalisation) చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తుంటే మరోవైపు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు. దేశ ఆర్ధిక వ్యవస్థ అభివృద్ధిఖి దోహదపడే ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరంపై ప్రజలను చైతన్యవంతం చేయాలని బ్యాంకు ఉద్యోగులను కోరారు.
మిశ్రమ ఆర్ధిక విధానం కలిగిన దేశ ఆర్ధిక వ్యవస్థ పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళితే ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొవలసి వస్తుందని ఆయన హెచ్చ రించారు. ఏఐబీఈఏ జాతీయ అధ్యక్షుడు బీఎస్ రాంబాబు, సహకార బ్యాంకుల ఉద్యోగుల అసోసియేషన్ నాయకుడు సురేందర్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షులు రవీంద్రనాథ్, ప్రధాన కార్యదర్శి పీవీ కృష్ణారావు,ఉద్యోగులు పాల్గొన్నారు.