హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్ ఆమోదించిన రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను కూడా అమలు చేయని ప్రధాని మోదీ రాష్ర్టానికి కొత్తగా ఏమిచ్చారో వెల్లడించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ డిమాండ్ చేశారు. మంత్రుల నివాసంలో సోమవారం తనను కలిసిన మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజన చట్టంలోని హామీలలో కొన్నింటిని తాము పోరాడి అమలు చేయించుకున్నామని, కానీ కేంద్రం కొత్తగా ఒరగబెట్టిందేమీ లేదని స్పష్టంచేశారు. వాటిని కూడా తామే అమలు చేశామని ప్రధాని మోదీ చెప్పడం విచిత్రంగా ఉన్నదని మండిపడ్డారు. పార్లమెంట్ ఆమోదించిన చట్టాన్ని ప్రధానిగా ఎవరున్నా అమలు చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. తెలంగాణ రాష్ర్టానికి ప్రత్యేకించి నిధుల ప్యాకేజీ గానీ, కొత్త పథకాలను గానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఇవ్వలేదని గుర్తుచేశారు. విభజన చట్టంలోని హామీల అమలు తెలంగాణ ప్రజల హకు అని స్పష్టం చేశారు.
‘బీజేపీ’ రాష్ర్టాలకు వేల కోట్లు.. తెలంగాణకు ఏవీ?
బీజేపీ పాలిత రాష్ట్రాల పర్యటనకు వెళితే అక్కడ వేల కోట్ల రూపాయల నిధులు కురిపించే ప్రధాని బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరయ్యేందుకు తెలంగాణకు వచ్చి రూపాయి కూడా ఇవ్వలేదని వినోద్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వ నీతి ఇదేనా? అని ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఒక న్యాయం, విపక్ష పార్టీల పాలిత రాష్ట్రాలకు మరో న్యాయం సమంజసమేనా? అని నిలదీశారు.
ఎనిమిదేండ్లకు మెగా టెక్స్టైల్ పార్క్ ప్రస్తావన
రాష్ట్రానికి మెగా టెక్స్టైల్పార్ను ఇవ్వనున్నట్టు ప్రధాని మోదీ ఎనిమిదేండ్ల తరువాత ఆదివారం ప్రకటించారని వినోద్కుమార్ పేర్కొన్నారు. ఆ పార్కు కోసం ఎనిమిదేండ్లుగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, తాను ప్రధానిని, కేంద్రాన్ని అడుగుతూనే ఉన్నామని, లేఖలు రాస్తూనే ఉన్నామని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తాము ముందే గుర్తించి సిరిసిల్లలో, వరంగల్ జిల్లాలో టెక్స్టైల్ పారు కోసం స్థలం సేకరించి ఇతర పనుల కోసం ముందుకు సాగుతున్నామని తెలిపారు.
జాతీయ రహదారులు, రైల్వే లైన్ల్లు, ఇరిగేషన్ పనుల విషయంలో తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తున్నదని వినోద్ మండిపడ్డారు. రూపాయి విలువ ఎందుకు తగ్గుతున్నదో చెప్పాలని ముఖ్యమంత్రి కేసీఆర్ డిమాండ్ చేస్తే ప్రధాని మోదీ వద్ద జవాబు లేకుండా పోయిందని విమర్శించారు. ‘అప్పులు తెచ్చి ఆస్తులను పెంచుతున్నామంటున్నారు.. తెచ్చిన అప్పులు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కోసం వినియోగిస్తున్నాం తప్ప జీతాలు, పెన్షన్ల కోసం వాడటం లేదు’ అని వినోద్కుమార్ స్పష్టంచేశారు.