హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): సింగరేణి సంస్థను ప్రైవేటీకరించబోమని చెప్పిన ప్రధాని మోదీ తెలంగాణ ప్రజలను దారుణంగా వంచించారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని పలు కోల్బ్లాక్స్ను వేలం వేసేందుకు టెండర్లను ఆహ్వానించడంతో కేంద్ర ప్రభుత్వ అసలు రంగు బయట పడిందని పేర్కొన్నారు. దీనిపై మోదీ ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. రాష్ట్రంలోని కోల్బ్లాక్స్ను వేలం వేసేందుకు కేంద్రం ప్రకటించిన టెండర్ల షెడ్యూల్ను, సంబంధిత డాక్యుమెంట్లను వినోద్కుమార్ ఆదివారం మీడియాకు విడుదల చేశారు.
కేంద్రం ఉద్దేశపూర్వకంగానే సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నదని నిప్పులు చెరిగారు. మైన్స్ అండ్ మినరల్స్ యాక్ట్-1957లోని సెక్షన్ 17ఏ/11ఏ ప్రకారం ఓపెన్ టెండర్తో సంబంధం లేకుండా సింగరేణికి కోల్బ్లాక్స్ను రిజర్వుచేసే అధికారం కేంద్రానికి ఉన్నందున ఆ మేరకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గోదావరి వ్యాలీ కోల్ఫీల్డ్ పరిధిలోని కల్యాణిఖని, కొయ్యలగూడెం, శ్రావణపల్లి, సత్తుపల్లి కోల్బ్లాక్స్ను సింగరేణికి కేటాయించాల్సి ఉన్నా కేంద్రం ఉద్దేశపూర్వకగానే పట్టించుకోవడంలేదని, పైగా కొయ్యలగూడెం కోల్బ్లాక్ను ఇప్పటికే వేలంవేసి ప్రైవేట్ సంస్థకు అప్పగించిందని దుయ్యబట్టారు.
అప్పుడో మాట.. ఇప్పుడో మాట!
సింగరేణిని ప్రైవేటీకరించబోమని ప్రధాని మోదీ ఇటీవల రామగుండంలో ప్రకటించారని వినోద్ గుర్తుచేశారు. సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వానికి 51%, కేంద్రానికి 49% వాటా ఉన్నందున ఆ సంస్థను తామెలా ప్రైవేటీకరిస్తామని చెప్పారని, కేంద్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. చట్టం ప్రకారం కోల్ బ్లాకులను బహిరంగ వేలం వేస్తున్నామని, ఈ వేలంలో సింగరేణి ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలతో పోటీపడి బొగ్గుబ్లాకును దకించుకోవాలని నిండు పార్లమెంట్లో ప్రకటించిన కేంద్ర గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్జోషి.. ఇందుకు తాజాగా టెండర్ షెడ్యూల్ను విడుదల చేశారని తెలిపారు. దీనికి వంత పాడుతున్న మోదీ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.
కేంద్రం కుట్రలపై ఇకనైనా మేలుకోవాలి
సింగరేణి పట్ల మోదీ సర్కార్ అనుసరిస్తున్న అనుచిత వైఖరి, బొగ్గు గనుల వేలం గురించి తాను ముందుగానే హెచ్చరించినా కేంద్రం, ప్రహ్లాద్జోషి, రాష్ట్ర బీజేపీ నాయకులు బుకాయించారని వినోద్కుమార్ మండిపడ్డారు. గత నెల 3 నుంచి ప్రారంభమైన వేలం ప్రక్రియ ఏడాది ఫిబ్రవరి 10 వరకు కొనసాగనున్నదని తెలిపారు. సింగరేణిని నిర్వీర్యం చేసేందుకు జరుగుతున్న ఈ కుట్రపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇకనైనా మేలుకోవాలని, బొగ్గు గనుల వేలాన్ని అడ్డుకోవాలని సూచించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని కొయ్యలగూడెం-3 కోల్బ్లాక్ను కేంద్రం ఆగస్టులోనే వేలంవేసి ఔరో కోల్ ప్రైవేట్ లిమిటెడ్కు అప్పగించిందని, భవిష్యత్తులో సింగరేణికి బొగ్గు గనులు దకకుండా చేయడమే కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా కనిపిస్తున్నదని వినోద్కుమార్ విమర్శించారు. ప్రైవేటీకరణ అనే పదం ఉపయోగించకుండా పకా ప్రణాళికతో కోల్బ్లాక్స్ను వేలం వేయడం ద్వారా సింగరేణి సంస్థను మూసివేసేందుకు కేంద్రం పావులు కదుపుతున్నదని మండిపడ్డారు. కోల్ బ్లాకులు లేకుంటే సింగరేణి ఎలా నడుస్తుందని ప్రశ్నించారు.