హైదరాబాద్: వికలాంగులకు చట్టపరంగా, సామాజికంగా రక్షణ ఉండాల్సిన అవసరం ఉందని ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. వారికోసం జాతీయ స్థాయిలో వికలాంగుల కమిషన్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో వికలాంగుల ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జాతీయ వికలాంగుల కమిషన్ను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్కు ఇటీవల లేఖ రాశానని, దీనికి మంత్రి సానుకూలంగా స్పందించారని చెప్పారు. వికలాంగులకు ఉద్యోగ, ఉపాధి రంగాల్లో మరిన్ని రిజర్వేషన్లు కల్పించి ప్రాధాన్యతను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.